Investers Wealth | అంతర్జాతీయంగా వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు వడ్డీరేట్లు పెంచడం, ముడి చమురు ధరలు పైపైకి దూసుకెళ్లడం.. విదేశీ పెట్టుబడులు ఉపసంహరణతో ఆర్థిక మాంద్యం భయాలు కమ్ముకుంటున్నాయి. దీంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడింది. ఫలితంగా గతవారం నుంచి మొదలైన బేర్ పట్టు ఈ వారం కూడా సాగింది. ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడికి పాల్పడ్డారు. ఫలితంగా వరుసగా ఆరు ట్రేడింగ్ల్లో ఇన్వెస్టర్లు రూ.18.17 లక్షల కోట్ల సంపద కోల్పోయారు.
ఈ వారం ట్రేడింగ్లో బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 3,959.86 పాయింట్లు (7.15 శాతం) నష్టపోయింది. శుక్రవారం ట్రేడింగ్లో బీఎస్ఈ సెన్సెక్స్ ఏడాది కనిష్ట స్థాయి 50,921.22 పాయింట్లకు పడిపోయింది. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 17 వరకు ఈక్విటీ మార్కెట్లలో బలహీన ధోరణి కొనసాగింది.
ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,17,747.13 కోట్లు కోల్పోయి రూ.2,36,77,816.08 కోట్లకు పడిపోయింది. రూ. 18 లక్షల కోట్ల పై చిలుకంటే కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే ఎక్కువ. శుక్రవారం నాటికి రిలయన్స్ ఎం-క్యాప్ రూ.17.51 లక్షల కోట్లు.