Invester Wealth | దేశీయ స్టాక్ మార్కెట్లలో గత ఆరు సెషన్లలో ఇన్వెస్టర్లు రూ.8.30 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయారు. ఈ నెల 16 నుంచి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1855.58 పాయింట్లు (మూడు శాతం) నష్టపోయింది. ఈ కాలంలో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,30,322.61 కోట్లు కోల్పోయి రూ.2,60,00,662.99 కోట్ల వద్ద స్థిర పడింది.
`అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి పుంజుకున్నా దేశీయ స్టాక్ మార్కెట్లో విశ్వాసం కల్పించడంలో వైఫల్యం వల్ల వరుసగా ఆరో రోజు నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. ప్రారంభ లాభాల నుంచి లాభాలు గడించేందుకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) స్టాక్స్ సేల్స్ కొనసాగుతున్నది. మరోవైపు రష్యా క్రూడాయిల్ ఎగుమతులు తగ్గడంతో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి` అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. శుక్రవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 141.87 పాయింట్లు (0.24 శాతం) నష్టపోయి 59,463.93 పాయింట్ల వద్ద స్థిర పడింది.
గురువారం నాటికి దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) రూ.1,417.24 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. శుక్రవారం బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.17 శాతం, స్మాల్ క్యాప్ 0.15 శాతం నష్టాలతో ముగిశాయి.
మెటల్ ఇండెక్స్ 2.39 శాతం, కమొడిటీస్ 1.17 శాతం, ఆటో 0.99 శాతం, రియాల్టీ 0.70, ఎఫ్ఎంసీజీ 0.40 శాతం, పవర్ 0.38 శాతం నష్టపోయాయి. ఎనర్జీ, హెల్త్ కేర్, కన్జూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లు లాభాలతో ముగిశాయి.