Gold ETFs | గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్స్)కు ఆదరణ పెరుగుతోంది. అనిశ్చిత పరిస్థితులు ఎదురైనప్పుడు ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా బంగారం కనిపిస్తున్నది. ఫిజికల్ గోల్డ్ తోపాటు డిజిటల్ రూపంలోనూ బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడ్ రిజర్వు నిర్ణయంపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో గత నెలలో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్స్)ల్లో పెట్టుబడులు భారీగా పెరిగాయి. సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్లో గోల్డ్ ఈటీఎఫ్స్ల్లో రూ.845 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టారు. గత సెప్టెంబర్ నెలలో కేవలం రూ.175 కోట్ల విలువైన పెట్టుబడులు మాత్రమే గోల్డ్ ఈటీఎఫ్స్ల్లో పెట్టుబడులు పెట్టారని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) పేర్కొన్నది.
భారతీయులు బంగారం అంటే ప్రాణం పెడతారు. తమ ఇంట్లో బంగారం ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్లేనని భావిస్తారు. అందుకే ప్రీ-దీపావళి ధంతేరాస్ కొనుగోళ్లు సానుకూలంగా మొదలయ్యాయి. ధంతేరాస్ పర్వదినంతోపాటు పెండ్లిండ్లు ఇతర శుభకార్యాలు ప్రారంభం కావడం, బంగారం ధర దిగి రావడంతో కొనుగోళ్లు సానుకూలంగా సాగుతున్నాయి. ద్రవ్యోల్బణం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, గ్రోత్ రేట్ నెమ్మదిస్తుందని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ మెల్విన్ సంతారియా పేర్కొన్నారు. దీనివల్ల బంగారానికి ఆదరణ పెరిగిందన్నారు. మార్చి నుంచి క్రమేపీ పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు గత నెల 29న ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ.62.960కి చేరుకుని దిగి వచ్చాయి.
సెప్టెంబర్ నెలలో గోల్డ్ ఈటీఎఫ్స్లో రూ.175.3 కోట్ల పెట్టుబడులు పెడితే, అక్టోబర్ నెలలో రూ.841 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఆగస్టులో రూ.1028 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 2022 ఏప్రిల్ తర్వాత గోల్డ్ ఈటీఎఫ్స్ల్లో పెట్టుబడులు గత ఆగస్టులో అత్యధికం. జూలైలో రూ.456 కోట్ల పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్స్ల్లోకి వస్తే, మూడు త్రైమాసికాల్లో వరుసగా గోల్డ్ ఈటీఎఫ్స్ నుంచి పెట్టుబడులు ఉపసంహరణ తర్వాత గత ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.298 కోట్ల పెట్టుబడులు వచ్చి చేరాయి.