న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: సీఈవో లేదా యాజమాన్య మార్పుపై ఇన్వెస్టర్లకు ఎటువంటి ఓటింగ్ హక్కులూ ఉండవని ఎడ్యుటెక్ దిగ్గజం బైజూస్ స్పష్టంచేసింది. బైజూస్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు, యాజమాన్య నియంత్రణ నుంచి వ్యవస్థాపకుల్ని తొలగించేందుకు అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని (ఈజీఎం) నిర్వహించాలంటూ కంపెనీలో పెట్టుబడులు చేసిన ఇన్వెస్టర్లు డిమాండ్ చేసిన నేపథ్యంలో శుక్రవారం బైజూస్ బ్రాండ్ నేమ్తో కార్యకలాపాలు నిర్వహిస్తున్న థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ వివరణ ఇచ్చింది. వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో బైజూస్ రవీంద్రన్ను మార్చడానికి కొంతమంది ఇన్వెస్టర్లు ఈజీఎం జరపాలంటూ ప్రకటనలివ్వడం విచారకరమని థింక్ అండ్ లెర్న్ పేర్కొంది. ఆర్థిక దుర్వినియోగం, పాలనా లోపాల కారణంగా డైరెక్టర్ల బోర్డును పునర్వ్యవస్థీకరించే తీర్మానం చేసేందుకు డాయిష్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ ప్రొసుస్ నేతృత్వంలో ఇన్వెస్టర్లు విడుదల చేసిన ఈజీఎం నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసుకు జనరల్ అట్లాంటిక్, పీక్ వీఎక్స్, సోఫినా, చాన్ జుకర్బర్గ్, ఓవెల్, శాండ్స్ వంటి ఇన్వెస్టర్ల మద్దతు ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వీటన్నింటికీ కలిపి బైజూస్లో 30 శాతం వాటా ఉంది.
ఈ వారంలోనే బైజూస్కు చెందిన యూఎస్ సబ్సిడరీ అల్ఫా అమెరికా కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. మరో వైపు బైజూస్కు వర్కింగ్ మూలధనం కొరవడటంతో ఉద్యోగులు వేతనాల చెల్లింపులో జాప్యం జరుగుతున్నదని వార్తలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో కొన్ని ఫండ్స్ ప్రస్తుత యాజమాన్యాన్ని మార్చాలన్న డిమాండ్ కారణంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టక్కేందుకు బైజూస్ చేపట్టిన రైట్స్ ఇష్యూకు ఆవాంతరం ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు. నిర్వహణా అవసరాలకు తాము ప్రతిపాదించిన 200 మిలియన్ డాలర్ల రైట్స్ ఇష్యూకు మెజారిటీ షేర్హోల్డర్ల మద్దతు లభించిందని, అయితే దురదృష్టవశాత్తూ కొద్దిమంది ఇన్వెస్టర్లు లేవనెత్తిన సమస్యలతో కంపెనీ, ఉద్యోగులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నదని బైజూస్ విడుదల చేసిన ప్రకటనలో వాపోయింది. వ్యవస్థాపకుడు ఒక బిలియన్ డాలర్లు పెట్టుబడి చేయడం మినహా గత రెండేండ్లుగా వెలుపలి ఇన్వెస్టర్ల పెట్టుబడులు కంపెనీలోకి రాలేదని, అందుచేతే త్వరితంగా నిధులు సమీకరించేందుకు రైట్స్ ఇష్యూ చేపట్టినట్టు బైజూస్ వివరించింది. ఈ ఇష్యూను పూర్తిచేస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. బైజూస్ విలువ 22 బిలియన్ డాలర్లు ఉంటుందని 2022లో అంచనా వేయగా, కొద్దినెలలుగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో ఈ విలువకు భారీగా కోతపడినట్టు విశ్లేషకులు చెపుతున్నారు.