ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆకర్షణీయం
ఫిబ్రవరిలో రూ.19,705 కోట్లు రాక
ఏడాదిగా కొనసాగుతున్న నిధుల ప్రవాహం
న్యూఢిల్లీ, మార్చి 9: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ల్లోకి నిధుల ప్రవాహం కొనసాగుతున్నది. గత నెల్లోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆకర్షించాయి. ఫిబ్రవరిలో రూ.19,705 కోట్లు వచ్చాయి. ఇలా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ల్లోకి నిధులు రావడం వరుసగా ఇది 12వ నెల. నిజానికి అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో ట్రేడ్ అవుతున్నాయి. అయినప్పటికీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ల్లోకి పెట్టుబడులు భారీ స్థాయిలో వస్తుండటం విశేషం. జనవరిలో రూ.14,888 కోట్లు రాగా, డిసెంబర్లోనైతే రూ.25,077 కోట్లు వచ్చాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) బుధవారం తెలియజేసింది. ఈ ఫిబ్రవరిలో మొత్తం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోకి రూ.31,533 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించింది. అయితే జనవరితో చూస్తే తగ్గడంతో ఇండస్ట్రీ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) గత నెలలో రూ.37.56 లక్షల కోట్లకు పడిపోయింది. జనవరి ఆఖర్లో ఇది రూ.38.01 లక్షల కోట్లుగా ఉన్నట్టు యాంఫీ వెల్లడించింది.
గతేడాది మార్చి నుంచి..
గతేడాది మార్చి నుంచి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉందని వివరించింది. ఈ క్రమంలోనే నిరుడు మార్చి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వచ్చిన మొత్తం నిధుల విలువ రూ.1.45 లక్షల కోట్లుగా ఉన్నదని పేర్కొన్నది. దీంతో మదుపరులలో నెలకొన్న సానుకూల దృక్పథానికి ఇది నిదర్శనమని ఇండస్ట్రీ అభిప్రాయపడుతున్నది. 2020 జూలై నుంచి ఫిబ్రవరి 2021 వరకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ల్లో పెట్టుబడుల ఉపసంహరణే కనిపించిందని గుర్తుచేసింది. ఈ 8 నెలల్లో రూ.46,791 కోట్ల నిధులు పరిశ్రమకు దూరమయ్యాయని యాంఫీ ఈ సందర్భంగా వివరించింది.
ఆకట్టుకోని డెట్ ఫండ్స్
ఓవైపు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ల్లోకి పెట్టుబడుల వరద పారుతుంటే.. మరోవైపు డెట్ మ్యూచువల్ ఫండ్స్ల్లోకి పెట్టుబడులు క్షీణించాయి. ఫిబ్రవరిలో రూ.8,274 కోట్లు తరలిపోయాయి. జనవరిలో రూ.5,088 కోట్లు వచ్చినట్టు యాంఫీ చెప్పింది. బంగారం ధరలు పెరుగుతుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను ఆ వైపునకు తరలిస్తున్నారని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. కాగా, షార్ట్-డ్యూరేషన్ ఫండ్స్కు అత్యధికంగా రూ.12,092 కోట్ల పెట్టుబడులు దూరమయ్యాయి. కార్పొరేట్ బాండ్ ఫండ్స్కు రూ.10,219 కోట్లు, ఫ్లోటర్ ఫండ్స్కు రూ.10,323 కోట్ల పెట్టుబడులు చేజారాయి.
రష్యా – ఉక్రెయిన్ దెబ్బ
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ల్లోకి వస్తున్న ఈ నిధుల ప్రవాహాన్ని అడ్డుకోవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెలలో ఈ నిధుల ప్రవాహం నెమ్మదించవచ్చని అంటున్నారు. అలాగే బీమా దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ఈ నెలాఖర్లోగా రాకపోతే కూడా పెట్టుబడులకు బ్రేక్ పడ్డట్టేనని చెప్తున్నారు. అయితే విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు దేశీయ మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరిస్తున్నా.. దేశీయ మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్నారని మరికొందరు నిపుణులు మార్కెట్ సరళిని విశ్లేషిస్తున్నారు.
‘అంతర్జాతీయంగా ఉద్రిక్తకర పరిస్థితులున్నాయి. సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను పెంచనున్నాయన్న అంచనాలూ గట్టిగా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ల్లోకి పెట్టుబడులు ఆకర్షణీయంగా వస్తుండటం చాలా ప్రోత్సాహకరం’
–రిక్కీ కిర్పలాని, ఫస్ట్ వాటర్ క్యాపిటల్ ఫండ్ లీడ్ స్పాన్సర్
‘గ్లోబల్ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలు, రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణల మధ్య కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ల్లోకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. పెట్టుబడులపై మదుపరులలో పెరిగిన అవగాహనకు ఈ పరిణామం నిదర్శనం’ –కవితా కృష్ణన్, మార్నింగ్స్టార్ ఇండియా సీనియర్ అనలిస్ట్
‘ఈక్విటీల్లో పెట్టుబడులకు దేశీయ మదుపరులు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. విదేశీ మదుపరులు పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్న వేళ ఇదో శుభ పరిణామం. ముఖ్యంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)లకు బలమైన మద్దతు లభిస్తున్నది’ –అఖిల్ చతుర్వేది, మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ సీబీవో