Investments | కొత్త సంవత్సరం మొదలైంది. గత ఏడాది అనుభవాలు.. వాటి నుంచి నేర్చుకున్న పాఠాలు ఇంకా మన ముందు కనిపిస్తూనే ఉన్నాయి. వృత్తిగత, వ్యక్తిగత జీవితాల విషయంలో ఎలాంటి ప్రణాళిక అవసరమో.. ఫైనాన్షియల్ టార్గెట్లను కూడా అంతే పద్ధతిగా చేరుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక లక్ష్యాలను చేధించే క్రమంలో ఏడాది మొదట్లోనే పక్కాగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు మనం వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే సక్సెస్ఫుల్, స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకుంటాం. ఈ క్రమంలో 2024లో ఉన్న పెట్టుబడి మార్గాలు ఏమేం ఉన్నాయో చూద్దాం..
స్టాక్ మార్కెట్లు
నిరుడు దేశీయ స్టాక్ మార్కెట్లలో నిఫ్టీ 20 శాతం వరకూ రాబడిని అందించింది. ఈ ఏడాది లోక్సభ ఎన్నికలు, కొత్త ప్రభుత్వ ఏర్పాటు, సంస్కరణలు, విదేశీ మదుపరుల పెట్టుబడులు వంటివి ప్రధానంగా మార్కెట్లపై ప్రభావం చూపిస్తాయనుకోవచ్చు. డిసెంబర్లో రికార్డు స్థాయిలో 42 లక్షల డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ అయ్యాయి. ఇదో ఆల్టైం రికార్డ్. దేశీయ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో సుమారు రూ.15 లక్షల కోట్ల ఆస్తులున్నాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు, ప్రత్యక్ష పన్నుల్లో వృద్ధి తదితర గణాంకాలు కూడా బాగానే ఉన్నాయి. అయితే స్మాల్, మిడ్క్యాప్ స్టాక్స్లో విపరీతమైన ఉత్సాహం కనిపిస్తోంది. బీఎస్ఈలో రికార్డు స్థాయిలో స్టాక్స్ అప్పర్ సర్క్యూట్స్ దగ్గర లాక్ అవుతున్నాయి. ఇది కాస్త రిస్కీగా కనిపిస్తోంది. దీంతో 2021-23 మధ్య వచ్చిన లాభాలు ఈసారి నిఫ్టీలో వచ్చేట్టు కనిపించడం లేదనే చెప్పాలి. సింగిల్ డిజిట్ లాభాలకు పరిమితం కావచ్చని రీసెర్చ్ సంస్థలూ అంచనా కడుతున్నాయి. కాబట్టి నిపుణుల సలహాలతో ముందుకెళ్తే ఆకర్షణీయ ఫలితాలను అందుకోవచ్చు.
బాండ్లు-డిపాజిట్లు
బాండ్లు, డిపాజిట్లపై పెట్టుబడులనూ పరిశీలించవచ్చు. ప్రస్తుతం ఆయా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై ఆకర్షణీయమైన వడ్డీరేట్లనే ఇస్తున్నాయి. 7.5 శాతం నుంచి 9 శాతం వరకున్నాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఏడాది వడ్డీరేట్ల విషయంలో మెత్తబడుతుందన్న అంచనాలున్నాయి. ఇదే జరిగితే ఎఫ్డీలపై వడ్డీరేట్లు తగ్గవచ్చు. అయినప్పటికీ రక్షణాత్మక పెట్టుబడుల్లో ఈ డిపాజిట్లకు స్థానం ఉండనే ఉంటుంది. బాండ్ల విషయానికొస్తే.. వీటిపై పెట్టుబడులకు పన్ను మినహాయింపులనూ పొందవచ్చు. ఆర్బీఐ జారీచేసే బాండ్లను పరిశీలించవచ్చు. అలాగే ఇతర సంస్థల బాండ్లనూ ఎంచుకోవచ్చు. అయితే గతంలో వాటి రాబడులు ఎలా ఉన్నాయన్న దానిపై విశ్లేషించి ఓ నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
చివరగా..
జీవిత బీమా, ఆరోగ్య బీమాలకూ పెద్దపీట వేయండి. ఇటు పెట్టుబడిగా, అటు మన కుటుంబాలకు ఆసరాగా కూడా వీటిని పరిగణించి ఓ నిర్ణయం తీసుకోండి. రేపటి రోజన్నది ఎలా ఉంటుందో మనకు తెలియదు. మనం లేని లోటును మనవారికి నేడు మనం చేసే ఈ బీమానే తీర్చగలదు.-నాగేంద్రసాయి కుందవరం
బంగారం
2023లో బంగారంపై పెట్టుబడులు 13 శాతం లాభాలను ఇచ్చాయి. గత పదేండ్లలో ఎంసీఎక్స్ గోల్డ్ 119 శాతం రాబడులను అందించింది. 20 ఏండ్లలో యావరేజ్ రిటర్న్స్ 12 శాతం వరకూ వర్కవుట్ అయ్యాయి. అమెరికాలో వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, యూఎస్-రష్యాల్లో ఎన్నికలు, రూపాయి మారకం విలువలో ఒడిదుడుకులు వంటి అనేక అంశాలు బంగారంపై ప్రభావాన్ని చూపించబోతున్నాయి. పైగా అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 2000 డాలర్లపైనే స్థిరంగా ట్రేడవుతోంది. దీంతో యూఎస్ బాండ్ ఈల్డ్స్, ఈక్విటీల్లోకి నిధులు వంటి అంశాలెన్నో కూడా పసిడిపై ప్రభావం చూపించే అవకాశం ఉన్నది. ఈ ఏడాది 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రూ.70-71వేల వరకూ వెళ్లే అవకాశాలున్నాయని టెక్నికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. కనుక మన పొదుపులో గరిష్ఠంగా 5-10 శాతం వరకూ గోల్డ్వైపు మళ్లించవచ్చు. అది కూడా సావరిన్ గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఈటీఎఫ్ల వంటివి ఇంకా బెటర్.
రియల్ ఎస్టేట్
కరోనాకు ముందుతో పోల్చితే ఆ తర్వాతే దేశీయ నిర్మాణ రంగంలో ఉత్సాహం కనిపిస్తున్నది. హైదరాబాద్తోపాటు ముంబై, ఢిల్లీ, గుర్గావ్, బెంగళూరు నగరాల్లో రెసిడెన్షియల్ సేల్స్ రికార్డులు కొట్టాయి. ప్రాపర్టీ కన్సల్టెంట్ల విశ్లేషణల ప్రకారం హౌజింగ్ సేల్స్లో గత ఏడాది హైదరాబాద్లో సుమారు 49 శాతం వృద్ధి నమోదైంది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు నేపథ్యంలో కొత్త సర్కారు విజన్పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది. దీంతో అప్పటిదాకా రియల్ ఎస్టేట్ రంగంలో కనీసం 9 నెలలపాటు స్థబ్ధత ఉండొచ్చనేది రియల్ ఎస్టేట్ రంగ నిపుణుల మాట. కమర్షియల్-అగ్రి థీమ్స్పై కూడా ఆసక్తి పెరుగుతోంది. కనుక ట్రెండ్నుబట్టి ముందుకెళ్తే మెరుగైన రాబడులను పొందవచ్చు.