ELSS | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) ప్రారంభమై ఐదు నెలలు గడిచిపోయింది. వేతన జీవులు.. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు, బుల్లి వ్యాపారులు ప్రతి ఒక్కరూ తమ ఐటీ రిటర్న్స్లో పన్ను మినహాయింపు క్లయిమ్ చేస్తారు. అందుకనుగుణంగా వివిధ పెట్టుబడి పథకాల్లో నిధులు మదుపు చేస్తుంటారు.. ఇప్పటికీ మీరు పన్ను ఆదా పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళిక రూపొందించుకోలేదా.. ఇప్పటికైనా సాధ్యమైనంత త్వరగా ప్లాన్ సిద్ధం చేసుకోవడంతోపాటు అమలు చేయడం ప్రారంభించాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పన్ను ఆదాతోపాటు మంచి రిటర్న్స్ రావాలని కోరుకుంటున్నారా.. అయితే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) సరైన ఆప్షన్ అవుటుంది. గత ఏడాది కాలంలో ఈఎల్ఎస్ఎస్ క్యాటగిరీలోని పలు ఫండ్స్ 26 శాతానికి పైగా రిటర్న్స్ ఇచ్చాయి.
ఈఎల్ఎస్ఎస్ కింద పెట్టుబడులపై ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల పెట్టుబడులపై పన్ను మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. అంటే మొత్తం టాక్సబుల్ ఆదాయం నుంచి రూ.1.5 లక్షలు మినహాయిస్తారు.
ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లో పెట్టుబడులకు మూడేండ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. మూడేండ్ల తర్వాత ఈ స్కీంలో పెట్టిన పెట్టుబడులు ఉపసంహరించుకోవచ్చు. ఇతర మదుపు పథకాలతో పోలిస్తే ఈ పథకానికి లాకిన్ పీరియడ్ చాలా తక్కువ. లాకిన్ పీరియడ్ తర్వాత కూడా ఇదే పథకంలో పెట్టుబడులు కొనసాగించాలని నిర్ణయించుకోవచ్చు. సుదీర్ఘకాలం ఈఎల్ఎస్ఎస్ పథకంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మరింత లాభదాయకంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఈఎల్ఎస్ఎస్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) కింద కనీసం రూ.500 పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. గ్రోత్ లేదా డివిడెండ్ ఆప్షన్ కింద పెట్టుబడి పెట్టొచ్చు. గ్రోత్ ఆప్షన్లో మనీ నిరంతరం పెరుగుతూ ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) లోనే పెట్టుబడులన్నీ మదుపు చేయడానికి బదులు సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (సిప్) కింద ఒక ఫండ్ లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. సిప్ కింద ప్రతి నెలా నిర్దిష్ట మొత్తం పెట్టుబడి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల రిస్క్ తగ్గడంతోపాటు మార్కెట్లో ఒడిదొడుకులకు పెద్దగా ప్రభావితం కాదు.