ముంబై, అక్టోబర్ 9: దేశవ్యాప్తంగా ఉద్యోగ నియమకాలు మళ్లీ ఊపందుకున్నాయి. కరోనాతో గత కొన్ని నెలలుగా నిరుత్సాహ పరిచిన ఉద్యోగ అవకాశాలు మళ్లీ పుంజుకున్నాయి. వరుసగా మూడో నెల సెప్టెంబర్లోనూ 57 శాతం వృద్ధి నమోదైందని జాబ్ ఇండెక్స్ పోర్టల్ నౌకరీ.కామ్ వెల్లడించింది. గత నెలలో 2,753 ఉద్యోగ అవకాశాలు లభించాయని తెలిపింది. కొవిడ్ ముందుస్థాయికంటే పెరిగి ఆల్టైం హైకీ చేరుకున్నట్లు తాజాగా వెల్లడించింది. మిగతా రంగాలతో పోలిస్తే ఐటీ రంగంలో ఉద్యోగ కల్పనలో 138 శాతం వృద్ధి నమోదైందని, అలాగే ఆతిథ్య రంగంలో 82 శాతంగా ఉన్నదని పేర్కొంది. దీంతోపాటు హాస్పిటాల్టీ(82 శాతం), రిటైల్(70 శాతం) రంగాలపై కరోనా దెబ్బ అత్యధికంగా పడిందని, ఇప్పుడిప్పుడే ఈ రంగాలు కోలుకుంటున్నాయని, ముఖ్యంగా గత నెలలో పలు హోటళ్ళు, స్టోర్లు తిరిగి తెరుచుకుంటున్నాయని వెల్లడించింది.
విద్యా రంగంలో 53 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, బ్యాంకింగ్/ఫైనాన్షియల్ సర్వీసుల్లో 43 శాతం, టెలికంలో 37 శాతం చొప్పున పెరిగాయి.
ద్వితీయ శ్రేణి నగరాలతో పోలిస్తే మెట్రో నగరాల్లో ఉద్యోగ కల్పనలో 88 శాతం వృద్ధి నమోదైంది.
గతేడాదితో పోలిస్తే బెంగళూరులో 133 శాతం అధికమవగా, హైదరాబాద్లో 110 శాతం, పుణెలో 95 శాతం, చెన్నైలో 85 శాతం చొప్పున పెరిగాయి.
ఢిల్లీ/ఎన్సీఆర్(72 శాతం), ముంబై, కోల్కతాల్లో 60 శాతంచొప్పున పెరిగాయి.