న్యూయార్క్: ఆటోమొబైల్ రంగం నుంచి కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ వరకు వివిధ రంగాలకు ఆశనిపాతంగా మారిన సెమీ కండక్టర్ల కొరత ఈ ఏడాది ద్వితీయార్థంలో కాస్త తగ్గుముఖం పడుతుందని ఇంటెల్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాట్ గెల్సింగర్ అంచనా వేశారు. అటుపై పుంజుకున్నా.. 2023 వరకూ చిప్ పరిశ్రమ సప్లయి- డిమాండ్ పరిస్థితి మెరుగు పడుతుందని చెప్పలేనన్నారు.
చిప్ల కొరత నుంచి బయటపడే లోపు పరిశ్రమల పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఓ ఇంటర్వ్యూలో పాట్ గెల్సింగర్ చెప్పారు. పర్సనల్ కంప్యూటర్లు, సర్వర్లు, డేటా సెంటర్లు, కార్పొరేట్ నెట్వర్క్ యంత్రాలకు అవసరమైన చిప్లను తయారు చేయడంలో ఇంటెల్దే ప్రధాన వాటా.
కరోనా మహమ్మారి నుంచి కోలుకుని గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న తర్వాత మోడర్న్ ఎలక్ట్రానిక్స్లో గుండెకాయ వంటి కాంపొనెంట్ల కోసం డిమాండ్లు వెల్లువెత్తుతారన్నారు పాట్ గెల్సింగర్.
కరోనా విశ్వమారిని నియంత్రించడానికి దేశాలన్నీ లాక్డౌన్ విధించడంతో ప్రపంచ జనాభా పనులు, విధులు డిజిటల్ సిస్టమ్ వైపు మళ్లాయి. ఫలితంగా సెమీ కండకర్ట్ల కోసం ఆర్డర్లు వరదలా పోటెత్తాయని గెల్సింగర్ అన్నారు.
ఇతర కంపెనీలు చిప్ల తయారీకి ఔట్ సోర్సింగ్పైనే ఆధారపడి ఉన్నాయి. వాటితో పోలిస్తే ఇంటెల్ యాజమాన్యం, దాని ఫ్యాక్టరీలు చిప్ల తయారీలో మెరుగ్గానే ఉన్నాయి. కానీ కంప్యూటర్లకు అవసరమైన విడి భాగాలను సరఫరా చేయడంలో వెనకబడింది.
దీర్ఘ కాలికంగా చిప్ల పరిశ్రమ గ్రోత్ దిశగా అడుగులేస్తుందన్ని గెల్సింగర్ అంచనా వేశారు. వచ్చే దశాబ్ద కాలంలో 5జీ ఫోన్ సిస్టమ్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో చిప్ల వాడకం పెరుగుతుంది. అందుకు అనుగుణంగా చిప్లకు భారీ డిమాండ్ ఉంటుందన్నారు గెల్సింగర్.
కొన్నేండ్లుగా అమెరికా-చైనా మధ్య కొనసాగిన వాణిజ్య యుద్ధం ప్రభావంతో గ్లోబల్ ఎకానమీలో సెమీ కండక్టర్లకు ప్రాముఖ్యం ఏర్పడింది. కరోనా మహమ్మారి వల్ల చిప్ల సరఫరా, డెలివరీపై తీవ్ర ప్రభావం చూపింది. డిమాండ్ పెరిగిపోవడంతో కొరతకు దారి తీసింది.
సెమీ కండక్టర్ల డిజైన్, సేల్స్లో అమెరికా కంపెనీలదే ఆధిపత్యం. కానీ, చిప్ల ఉత్పత్తిని ఆసియాకు మళ్లించారు. చిప్ల ఉత్పత్తిలో ఆసియా ఖండంలోని తైవాన్ సెమీ కండక్టర్ మాన్యుఫాక్చరింగ్, దక్షిణ కొరియా శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రధాన భూమిక వహిస్తున్నాయి.