న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: బీమా సంస్థలు తమ పాలసీదారుల కోసం ఈ-ఇన్సూరెన్స్ ఖాతాలను తెరవాలని బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ ఆదేశించింది. కస్టమర్ల సౌకర్యార్థం బీమా పాలసీలకు సంబంధించిన భౌతిక పత్రాలను ఆన్లైన్ ఫార్మాట్లోకి మార్చాలని ఎప్పట్నుంచో కోరుతున్న ఐఆర్డీఏఐ.. అందులోభాగంగానే ఈ-ఇన్సూరెన్స్ ఖాతాల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నది.
అయితే అన్ని కొత్త ఇన్సూరెన్స్ పాలసీల డాక్యుమెంట్లు ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఆన్లైన్ ఫార్మాట్లోనే లభించాలన్న ఐఆర్డీఏఐ.. వచ్చే ఏడాది డిసెంబర్కల్లా ప్రస్తుత, పాత పాలసీల పత్రాలన్నీ కూడా సవరించదగిన ఆన్లైన్ ఫార్మాట్లోకి మార్చాలని తాజా సమావేశంలో బీమా సంస్థలకు స్పష్టం చేసింది.
దీనివల్ల పాలసీ రెన్యువల్ సమయంలో పాలసీదారుడి పని సులువవుతుందని, పేపర్ వర్క్ ఉండదని, పైగా లావాదేవీల ఖర్చు తగ్గడమేగాక పాలసీల్లో సవరణలూ వేగిరమవుతాయని ఐఆర్డీఏఐ అంటున్నది. అయితే పాలసీ పత్రాలను ఆన్లైన్ ఫార్మాట్లోకి మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలను జీవిత, ఇతర బీమా సంస్థలకు ఈ సమావేశంలో ఐఆర్డీఏఐ అధికారులు వివరిస్తూనే.. దీనిపై వారి అభిప్రాయాలనూ కోరారు. కాగా, నవంబర్ 1 నుంచి అన్ని బీమా పాలసీలకు ఈకేవైసీ తప్పనిసరి.
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్లతో బీమా పాలసీలు అనుసంధానించబడతాయి. మరోవైపు బీమా పాలసీల విక్రయం, సేవలు, క్లయిముల పరిష్కారార్థం ‘బీమా సుగమ్’ అనే ఓ డిజిటల్ వేదికనూ అందుబాటులోకి తీసుకురావాలని పరిశ్రమకు ఐఆర్డీఏఐ సూచిస్తున్నది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి బీమా సుగమ్ అందుబాటులోకి వచ్చే వీలున్నది.