న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: దేశీ కుబేరుడు, ప్రధాని నరేంద్ర మోది మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ తక్షణం అప్పులు చెల్లించడానికి, ప్రాజెక్టుల వ్యయానికి పెట్టుబడులు చేయడానికి అవసరమైన నిధుల కోసం వివిధ మార్గాలను అన్వేషిస్తున్నప్పటికీ, వాటిని సమీకరించడం సులభమేమీ కాదని ఫోర్బ్స్ తాజా కథనంలో వెల్లడించింది. అదానీ గ్రూప్ కార్పొరేట్ అవకతవకలపై అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ రిపోర్ట్ విడుదల చేసిన తర్వాత ఆ గ్రూప్ షేర్లు నిలువునా పతనమైన సంగతి తెలిసిందే. అలాగే అదానీ ఎంటర్ప్రైజెస్ రూ. 20,000 కోట్ల ఫాలో ఆన్ ఆఫర్ను సైతం రద్దు చేసుకున్న విషయం విదితమే.
దీంతో అదానీ గ్రూప్ రానున్న కొద్ది నెలల్లో తీర్చాల్సిన రుణాల కోసం, మూలధన పెట్టుబడుల కోసం తీబ్రవ ప్రయత్నాలు చేస్తున్నది. ఎఫ్పీవోను రద్దు చేసుకున్నందున, క్విప్ ఇష్యూ (సంస్థాగత ఇన్వెస్టర్లకు ఈక్విటీ షేర్ల ప్లేస్మెంట్), ప్రిఫెరెన్స్ షేర్ల ఇష్యూ తదితర మార్గాల ద్వారా నిధుల్ని సమీకరిస్తామని అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధి చెప్పినట్టు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. కొంతమంది ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నారని, వారి పేర్లను త్వరలో వెల్లడిస్తామని కూడా ఆ ప్రతినిధి తెలిపారు. అయితే ఈ రీతిలో నిధుల సమీకరణ అంత సులభం కాదని విశ్లేషకులు కొట్టివేస్తున్నారు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పతనమైన స్థాయిలో కూడా అధిక విలువలతో కూడుకున్నవేనని, ఈ విలువలపై క్విప్ ఇష్యూ, ప్రిఫరెన్షియల్ ఇష్యూల ద్వారా నిధుల సమీకరణ కష్టసాధ్యమని, అదానీ ఎంటర్ప్రైజెస్ చేపట్టే ఏ ఫండ్రైజింగ్ రౌండ్కైనా ఇన్వెస్టర్లు ఎలా స్పందిస్తారో చూడాల్సి వుందని ఒక విశ్లేషకుడు వివరించారు.
అదానీ కంపెనీల రేటింగ్ను అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ డౌన్గ్రేడ్ చేయడం గ్రూప్కు పెద్ద షాక్గా పరిణమించింది. అదానీ పోర్ట్స్, అదానీ ఎలక్ట్రిసిటీ క్రెడిట్ రేటింగ్ను ‘స్టేబుల్’ నుంచి అధిక రిస్క్ను సూచించే ‘నెగిటివ్’కు తగ్గిస్తూ అదానీ గ్రూప్నకు ఉన్న గవర్నెన్స్ రిస్క్లు, నిధుల సమీకరణ సవాళ్ల కారణంగా రేటింగ్ డౌన్గ్రేడ్ చేస్తున్నట్టు ఎస్ అండ్ పీ వివరించింది. హిండెన్బర్గ్ ఆరోపణల కారణంగా అదానీ గ్రూప్కు తాజా ఈక్విటీ లేదా బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించే సామర్థ్యం దెబ్బతింటుందని రేటింగ్ ఏజెన్సీ వ్యాఖ్యానించింది. ముఖ్యంగా యూఎస్ డాలర్ బాండ్ మార్కెట్ల నుంచి సమీకరణ కష్టసాధ్యమని పేర్కొంది అదానీ గ్రూప్లోని రేటెడ్, అన్రేటెడ్ కంపెనీలన్నీ భారీ వృద్ధి లక్ష్యాల్ని నిర్దేశించుకున్నాయని, నిధుల సమీకరణ సామర్థ్యం సన్నగిల్లడంతో ఈ లక్ష్యాల్ని కంపెనీలు చేరలేవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అదానీ గ్రూప్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో 2030కల్లా 70 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు గతంలో ప్రకటించింది. ఈ పెట్టుబడి ప్రతిపాదనలకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఎనర్జీ రంగంలో అదానీకి ఫ్రాన్స్ భాగస్వామి టోటల్ ఎనర్జీస్ తన 4 బిలియన్ డాలర్ల హైడ్రోజన్ పెట్టుబడులను ప్రస్తుతం నిలిపివేసినట్టు ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. హిండెన్బర్గ్ రిపోర్ట్తో అంతర్జాతీయ ఇన్వెస్టర్లు సహజంగానే ఆందోళనకు గురవుతారని యాక్యుట్ రేటింగ్స్ సీఈవో శంకర్ చక్రవర్తి చెప్పారు. అయితే ఇండియాలో గ్రీన్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఇంకా తొలిదశలోనే ఉన్నదని, దీర్ఘకాలిక ఈఎస్జీ ఫండ్స్ను ఆకర్షించే సామర్థ్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయని చెప్పారు.
అదానీ గ్రూప్ నికర రుణం 2022 సెప్టెంబర్ నాటికి అదానీ గ్రూప్ స్థూల రుణం రూ. 2.26 లక్షల కోట్లకుపైగా, నికర రుణం రూ.1.96 లక్షల కోట్లకు పైగా ఉన్నది. నగదు, తత్సమాన నిల్వలు పరిమితంగా రూ.29,754 కోట్ల మేర ఉన్నాయి. నికర రుణంతో పోలిస్తే గ్రూప్ ఆస్తులు 1.89 రెట్లు ఉన్నాయి. అదానీ గ్రూప్ డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో (డీఎస్సీఆర్) ప్రస్తుతం 2.03 రెట్లు ఉంది. ప్రస్తుత రుణాల చెల్లింపునకు అందుబాటులో ఉండే క్యాష్ఫ్లోను లెక్కించేదే డీఎస్సీఆర్. ఇది 1 లోపున ఉంటే బయటమార్గాల ద్వారా డబ్బు తెచ్చుకుంటే తప్ప కంపెనీ రుణాలు చెల్లించలేదని భావిస్తారు. అదానీ గ్రూప్నకు ఇది 2.03 రెట్లు ఉన్నప్పటికీ, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు గ్రూప్ సామర్థ్యంపై రిస్క్లను వ్యక్తం చేస్తున్నాయి. మరో అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ కూడా నాలుగు అదానీ కంపెనీలను స్టేబుల్ నుంచి నెగిటివ్గా డౌన్గ్రేడ్ చేసింది.