హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఇన్ల్యాండ్ పోర్టు రానున్నది. దుబాయ్కి చెందిన బహుళజాతి లాజిస్టిక్స్ కంపెనీ డీపీ వరల్డ్.. సరకు రవాణా కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్ల్యాండ్ పోర్టు టెర్మినల్ నిర్మించాలనే యోచనలో ఉన్నది. త్వరలోనే అది కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమాఖ్య (ఎఫ్టీసీసీఐ) అధ్యక్షుడు కే భాస్కర్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని గీతం బిజినెస్ స్కూల్లో ‘లాజిస్టిక్స్ రంగం-పెరుగుతున్న ఉపాధి అవకాశాలు’ అనే అంశంపై నిర్వహించిన ఒక్కరోజు అంతర్జాతీయ సదస్సును ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డీపీ వరల్డ్కు ప్రపంచవ్యాప్తంగా 60 పెద్ద ఓడరేవులు ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఇన్ల్యాండ్ పోర్టుల ఏర్పాటుకున్న అవకాశాల దృష్ట్యా ఇక్కడ నిర్మించాలని చూస్తున్నట్లు చెప్పారు. ఇటీవల దుబాయ్ ఎక్స్పోలో పాల్గొన్న ఎఫ్టీసీసీఐ ప్రతినిధులు.. తెలంగాణలో డ్రై పోర్టులను ఏర్పాటు చేయాలని దుబాయ్ పరిశ్రమలను కోరిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో డీపీ వరల్డ్ నుంచి సానుకూల సంకేతాలు రావడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో లాజిస్టిక్స్ రంగం అధిక వృద్ధిని నమోదు చేస్తున్నదని, భారత్లోనూ పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పిస్తున్న రంగాల్లో ఒకటిగా ఉందని భాస్కర్రెడ్డి గుర్తుచేశారు. భవిష్యత్తులో లాజిస్టిక్స్ రంగం మరింత వృద్ధిపథంలో దూసుకుపోగలదన్నారు. అందుకే ఈ రంగంపై విద్యార్థులు సొంతంగా పరిశోధనలు చేపట్టడంతోపాటు ఇంటర్న్షిప్లు చేయాలని సూచించారు. ఫలితంగా ఈ తరహా పోర్టులపై మంచి అవగాహన ఏర్పడుతుందన్నారు. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ మాట్లాడుతూ 1981 నుంచి లాజిస్టిక్ రంగం ఎదుగుదల, సాధిస్తున్న ప్రగతిని గుర్తు చేశారు. దేశ జీడీపీలో లాజిస్టిక్స్ రంగానికి 12 శాతం వాటా ఉందని, 18 శాతం వృద్ధితో ఆ రంగం ముందుకు వెళ్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో గీతం బిజినెస్ స్కూల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీ కరుణాకర్, చెన్నైలోని లాజిస్టిక్స్ నైపుణ్య మండలి సీఈవో కెప్టెన్ రామానుజన్ తదితరులు పాల్గొన్నారు.
సముద్ర తీరానికి దూరంగా భూమిపై ఏర్పాటుచేసే పోర్టు ఇది. ఇక్కడి నుంచి విదేశీ ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహిస్తారు. సరకులను ట్రక్కుల్లో లోడ్ చేసిన తర్వాత రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా నేరుగా సముద్ర తీరంలోని ఓడరేవుకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తారు. తెలంగాణ నుంచి ఎగుమతులను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్రై పోర్టుల కోసం భూమిని సేకరిస్తోంది. సముద్ర తీరానికి నల్లగొండ ప్రాంతం దగ్గరగా ఉండటంతో డ్రై పోర్టును ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.
పూర్తిగా సముద్ర జలాలపై చేసే రవాణాకు సంబంధించిన పోర్టు ఇది. నౌకలు, ఓడల నుంచి సరకులు, ప్రయాణీకులను భూ భాగంపైకి తెచ్చేందుకు, తిరిగి పంపేందుకు అనువుగా వీటి నిర్మాణం ఉంటుంది. వీటిని ఓడరేవులు అని కూడా పిలుస్తారు. సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రమే ఈ రేవులు సాధ్యం.
ఇన్ల్యాండ్ పోర్టు అంటే భూజల మార్గాలపై ఏర్పాటయ్యే పోర్టు అని అర్థం. నది, సరస్సు లేదా కాలువ వంటి జలమార్గంలో ఉన్న రేవు. ఇది సముద్రానికి అనుసంధానించబడి ఉంటుంది. సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాల నుంచి ఎగుమతులను పెంచేందుకు అనుకూలంగా ఉన్న నీటి మార్గాలను ఆధారంగా చేసుకొని ఇన్ల్యాండ్ పోర్ట్లను ఏర్పాటు చేస్తారు. రోడ్డు మార్గంలో కాకుండా నదులు, కాలువల ద్వారా పడవలు, ఓడల్లో సరకులను సముద్రతీరంలోకి తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది.