విద్యుత్తు సంక్షోభంతో గత కొన్నిరోజులుగా చైనాలో నెలకొన్న దారుణ పరిస్థితులు త్వరలో భారత్నూ చుట్టుముట్టనున్నాయా?.. రానున్న రోజుల్లో విద్యుత్తు చార్జీలు భారీగా పెరుగుతాయా?.. దేశంలో ప్రస్తుతమున్న పరిస్థితులను చూస్తే ఈ ఆందోళనలు నిజమయ్యే ప్రమాదం లేకపోలేదని విద్యుత్తు రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-బిజినెస్ డెస్క్
దేశంలోని 70 శాతం విద్యుత్తు అవసరాలను నల్ల బంగారమే (బొగ్గు) తీరుస్తున్నది. అయితే, బొగ్గు ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రభుత్వ థర్మల్ పవర్ స్టేషన్లలో గత కొన్ని రోజులుగా బొగ్గు నిల్వలు అడుగంటిపోతున్నాయి. ఆగస్టు చివరినాటికి 13 రోజులకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు ఉండగా, గత నెల చివరినాటికి ఇది మరింతగా దిగజారి నాలుగు రోజులకు మాత్రమే సరిపడే నిల్వలకు చేరుకున్నది. ఈ స్థాయిలో బొగ్గు నిల్వలు అడుగంటడం గత కొన్నేండ్లలో ఇదే మొదటిసారి. సెప్టెంబర్ చివరి నాటికి థర్మల్ పవర్ ప్లాంట్ల వద్ద ఉన్న బొగ్గు నిల్వలు 81 లక్షల టన్నులకు తగ్గిపోయాయని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. గతేడాదితో పోలిస్తే అది 76 శాతం తక్కువ. 60,000- 80,000 టన్నుల బొగ్గు కొరతతో ప్రస్తుతం ఒక్కో ప్లాంట్ నడుస్తున్నదని నిపుణులు చెప్తున్నారు.
సంక్షోభానికి కారణాలేంటి?
కరోనా ఉద్ధృతి తగ్గడంతో పరిశ్రమలన్నీ తిరిగి కార్యకలాపాలను ప్రారంభించాయి. దీంతో విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరిగిపోయింది. అయితే, వర్షాల కారణంగా బొగ్గు గనుల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో బొగ్గు వెలికితీత పనులకు ఆటంకం ఏర్పడటంతో థర్మల్ కేంద్రాలకు దాని సరఫరా నిలిచిపోయింది.
మార్గాలు ఉన్నాయి.. కానీ,
విద్యుత్తు సంక్షోభాన్ని నివారించేందుకు థర్మల్ ప్లాంట్ల ప్రతినిధులు రెండు ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నారు. దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని ఎక్కువ ధర చెల్లించి వాటిని కొనుగోలు చేయడం ఒకటైతే, సముద్ర మార్గం ద్వారా విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవడం రెండోది. అయితే, ఇలా అధిక ధర చెల్లించి బొగ్గును కొని ఉత్పత్తి చేసిన విద్యుత్తుకు గత చార్జీలనే వసూలు చేయడం కుదరదని, చార్జీల పెంపు తప్పదని చెప్తున్నారు.
ప్రైవేట్ ప్లాంట్లకు ‘నో’టెన్షన్
దేశంలోని ప్రధాన ప్రభుత్వ థర్మల్ప్లాంట్లు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రైవేటు ప్లాంట్లయిన జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, టాటా పవర్, అదానీ పవర్లపై ఈ సంక్షోభం ఎంత మాత్రం ప్రభావం చూపబోదని విశ్లేషకులు చెప్తున్నారు. ముందుచూపుతో ఆయా సంస్థలు ఇప్పటికే పెద్దమొత్తంలో బొగ్గును నిల్వచేసుకోవడమే దీనికి కారణమని పేర్కొంటున్నారు. మరోవైపు, ప్రైవేటు వ్యక్తులు ముందుచూపుతో బొగ్గు నిల్వలను సమీకరించుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంవల్లే దేశంలో విద్యుత్తు సంక్షోభం తలెత్తే పరిస్థితి వచ్చిందని మండిపడుతున్నారు.
కోతలు తప్పవు!
ప్లాంట్లలో విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా క్రమబద్దీకరణ అయ్యేంతవరకూ విద్యుత్తు కోతలు తప్పేలా కనిపించడంలేదు. త్వరలో విద్యుత్తు ధరలు కూడా పెరుగొచ్చు. రానున్న కొన్ని నెలల్లోనే వినియోగదారులపై ఈ ప్రభావం పడనున్నది