Infosys | దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరి త్రైమాసికంలో 30 శాతం నికర లాభాలు పెంచుకున్నది. జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.7,969 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాలు సంపాదించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.6,128 కోట్ల నికర లాభంతో పోలిస్తే 30 శాతం గ్రోత్ నమోదు చేసింది. 2023-24 మార్చి త్రైమాసికం నికర ఆదాయం రూ.37,441 కోట్ల నుంచి రూ.37,923 కోట్లకు పెరిగింది. 2022-23తో పోలిస్తే ఒక శాతం ఆదాయం పెంచుకున్నట్లు ఇన్ఫోసిస్ తన రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది.
గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 8.9 శాతం గ్రోత్ తో రూ.24,095 కోట్ల నుంచి రూ.26,233 కోట్ల నికర లాభం పెంచుకున్నది ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక శాతం నుంచి మూడు శాతం వరకూ గ్రోత్ ఉంటుందని అంచాన వేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి షేర్ పై రూ.20 డివిడెండ్ ప్రకటించిన ఇన్ఫోసిస్.. ప్రత్యేకంగా ఒక్కో షేర్ మీద రూ.8 డివిడెండ్ కూడా ప్రకటించింది. జర్మనీకి చెందిన సంస్థ ఇన్ టెక్ లో పూర్తి వాటాను 450 మిలియన్ యూరోలకు కొనుగోలు చేస్తామని ఇన్ఫోసిస్ తెలిపింది. ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో గురువారం ఇన్ఫీ షేర్ బీఎస్ఈలో స్వల్పంగా లాభ పడి రూ.1420.50 వద్ద స్థిర పడింది.
ప్రస్తుతం ఇన్ఫోసిస్ సంస్థలో 3,17,240 మంది పని చేస్తుండగా, గత ఆర్థిక సంవత్సరంలో 25,994 మంది కంపెనీ నుంచి వెళ్లిపోయారు. జనవరి-మార్చి త్రైమాసికంలో 5,423 మంది ఉద్యోగులు సంస్థకు రాజీనామా చేశారు. 2022-23లో 3,43,234 మంది ఉద్యోగులు పని చేశారు. గత ఏడాది కాలంలో రెవెన్యూ గ్రోత్ 1.4 శాతం ఉన్నా ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గడం గత 20 ఏండ్లలో ఇదే తొలిసారి.