Infosys | అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ముప్పు భయాలు.. దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ను వెంటాడుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2022-23) చివరి త్రైమాసికంలో మార్కెట్ అంచనాలను ఇన్ఫీ మిస్ అయ్యింది. అంచనాల కంటే తక్కువ నికర లాభాలు నమోదు చేయడంతోపాటు 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేవలం 4-7 శాతం రెవెన్యూ గ్రోత్ మాత్రమే ఉంటుందని ప్రకటించింది. అమెరికా బ్యాంకింగ్ సెక్టార్లో సంక్షోభం, మాంద్యం ముప్పు నేపథ్యంలో ఐటీ సంస్థల క్లయింట్లు తమ ఐటీ బడ్జెట్ కుదించేశాయి. పలు కారణాల వల్ల కంపెనీ గతేడాది రెవెన్యూ గైడెన్స్ అంచనాలను మిస్ కావడం నిరాశ పరిచిందని ఇన్ఫోసిస్ పేర్కొన్నది. కొందరు క్లయింట్లు విధాన నిర్ణయాల్లో జాప్యం, ప్రణాళిక లేని ప్రాజెక్టులు నిలిచిపోవడం వంటి అంశాలు కారణం అని తెలిపింది. గతంలో 2018-19లో మాత్రమే సింగిల్ డిజిట్ గైడెన్స్ నమోదు చేసింది.
దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్.. గత జనవరి-మార్చి త్రైమాసికంలో 6,128 కోట్ల నికర లాభాలు గడించింది. 2021-22తో పోలిస్తే 7.8 శాతం మాత్రమే. గత అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే ఏడు శాతం మాత్రమే. గత ఆర్థిక సంవత్సరంలో అంచనాల కంటే తక్కువగా రెవెన్యూ గ్రోత్ 15.3 శాతానికి పరిమితమైంది. జనవరిలో క్యూ3 ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో తదితర ఐటీ సంస్థలతో పోలిస్తే ఇన్ఫోసిస్ 2022-23 రెవెన్యూ గైడెన్స్ 16-16.5 శాతం ఉండొచ్చునని అంచనా వేసింది. 2022-23 రెవెన్యూ గైడెన్స్ 15-16 శాతం ఉండొచ్చునని గతేడాది ఇన్ఫోసిస్ వేసిన అంచనాలు ఆచరణకు నోచుకోలేదు. ఇన్ఫోసిస్ గ్రోత్ వార్షిక ప్రాతిపదికన 8.8 శాతంగా నమోదైనా.. కాన్స్టంట్ కరెన్సీ రూపంలో 3.2 శాతం తగ్గుముఖం పట్టింది.
నాలుగో త్రైమాసికంలో రెవెన్యూ గ్రోత్ 16 శాతం పెరిగి రూ.37,441 కోట్లకు చేరుకున్నది. 2022 డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 2.3 శాతం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4-7 శాతం మధ్య రెవెన్యూ గ్రోత్ ఉండొచ్చునని ఇన్ఫోసిస్ అంచనా వేసింది. ప్రస్తుత ఏడాది అంచనాలు కూడా విశ్లేషకుల నిర్ధారణ కంటే తక్కువే.