మూడో త్రైమాసిక ఫలితాలు స్థిరంగా ఉన్నాయి. 3.2 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నాం. వీటిలో కొత్తగా వచ్చినవి 71 శాతం. కృత్రిమ మేధస్సు, డిజిటల్, క్లౌడ్, ఆటోమేషన్ సేవలకు డిమాండ్ అధికంగా ఉండటంతో గత తొమ్మిది త్రైమాసికాల్లో ఇంతటి స్థాయిలో రావడం ఇదే తొలిసారి. తొలి మూడు త్రైమాసికాల్లో పనితీరు ఆధారంగా నాలుగో త్రైమాసికం అవుట్లుక్ను డిసైడ్ చేస్తుండటంతో ఆదాయ అంచనాను తగ్గించడం జరిగింది.
– సలీల్ పరేఖ్, ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ
న్యూఢిల్లీ, జనవరి 11: దేశీయ టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 7.3 శాతం తగ్గి రూ.6,106 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.6,586 కోట్ల నికర లాభాన్ని గడించిన విషయం తెలిసిందే. సమీక్షకాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.38,318 కోట్ల నుంచి రూ.38,821 కోట్లకు చేరుకున్నది. వృద్ధి పరంగా చూస్తే 1.3 శాతం పెరిగింది. క్లయింట్ల నుంచి డిమాండ్ పడిపోవడం, వార్షిక విక్రయాలు అంచనాల్లో కోత విధించడంతో లాభాలపై ప్రతికూల ప్రభావం చూపాయని పేర్కొన్నారు.