న్యూఢిల్లీ, జూన్ 25: దేశీయ ఐటీ దిగ్గజాల్లో రెండో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్ వాటాదారుల పంట పండింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో వాటాదారులకు రూ.24,100 కోట్ల(3.1 బిలియన్ డాలర్లు) నిధులను పంచింది. వీటిలో డివిడెండ్ రూపంలో ప్రతి షేరుకు రూ.31, షేర్ల బైబ్యాక్ కింద రూ.11 వేల కోట్లు ఉన్నాయని కంపెనీ కో-ఫౌండర్, చైర్మన్ నందన్ నీలేకని తెలిపారు. శనివారం కంపెనీ 41వ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2021-22లో డాలర్ కరెన్సీరూపంలో వృద్ధి 19.7 శాతంగా ఉన్నదని, 16.3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు చెప్పారు. గడిచిన 11 ఏండ్లలో ఒక ఏడాది ఇంతటి స్థాయిలో వృద్ధి చెందడం ఇదే తొలిసారి.
తుది డివిడెండ్ కింద రూ.16 ప్రకటించిన సంస్థ..మధ్యంతర డివిడెండ్ కింద రూ.15 ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.31 డివిడెండ్ చెల్లించడానికి రూ.13 వేల కోట్ల నిధులను వెచ్చించింది. అలాగే రూ.11 వేల కోట్లను బైబ్యాక్ రూపంలో చెల్లింపులు జరిపింది. మరోవైపు, కంపెనీ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ను మరో ఐదేండ్లపాటు నియామకానికి బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో జూలై 1, 2022 నుంచి మార్చి 31, 2027 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.