Infosys CEO | టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం రోజురోజుకు పెరుగుతున్న వేళ ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనరేటివ్ ఏఐ (Generative AI) వల్ల తమ సంస్థలో ఉద్యోగాలు తగ్గించబోమని ఓ ఆంగ్ల టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు. ఆర్థిక మాంద్యానికి తోడు జనరేటివ్ ఏఐ ప్రభావంతో టెక్, సాఫ్ట్ వేర్ కంపెనీల్లో లేఆఫ్స్ భయంతో ఐటీ రంగ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో ఇన్ఫీ సీఈఓ సలీల్ పరేఖ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
తమ వంటి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలకు జనరేటివ్ ఏఐ వంటి టెక్నాలజీ కలిసి వస్తుందని సలీల్ పరేఖ్ చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులను తొలగిస్తున్నారా? అన్న ప్రశ్నపై ఆయన స్పందిస్తూ.. తాము అలా చేయడం లేదన్నారు. సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో ఇతర కంపెనీలు ఆ పని చేస్తు్న్నాయని, ఆ విధానం సరి కాదని తాము స్పష్టంగా చెప్పాం అని అన్నారు.