ముంబై: ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిన్( Infosys ) షేర్లు మంగళవారం ఇంట్రాడేలో కొత్త రికార్డులను అందుకున్నాయి. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 బిలియన్ డాలర్లు(సుమారు రూ.7.41 లక్షల కోట్లు) దాటింది. ఈ ఘనత సాధించిన నాలుగో ఇండియన్ కంపెనీగా ఇన్ఫోసిస్ నిలిచింది. అంతేకాదు దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ అయిన ఇన్ఫీ.. ఈ ఆర్థిక తొలి త్రైమాసికంలో చెప్పుకోదగిన లాభాలు ఆర్జించింది.
గతేడాది జూన్తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫీ నికర లాభం రూ.4,233 కోట్లు కాగా.. ఈసారి అది రూ.5,195 కోట్లుగా ఉంది. మంగళవారం ఉదయం ఇన్ఫోసిస్ షేరు ధర గరిష్ఠంగా రూ.1755.60ను తాకడం గమనార్హం. కంపెనీ స్థిర కరెన్సీలో పూర్తి ఏడాది వృద్ధి అంచనాను పెంచింది. గతంలో ఇది 12 నుంచి 14 శాతంగా అంచనా వేయగా.. ఇప్పుడు అది 14 నుంచి 16 శాతంగా అంచనా వేసింది.