న్యూఢిల్లీ, జనవరి 12: సాఫ్ట్వేర్ సర్వీసుల దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ విశ్లేషకుల అంచనాల్ని మించిన ఆర్థిక ఫలితాల్ని వెల్లడించడంతో పాటు గైడెన్స్ను సైతం భారీగా పెంచింది. 2021 డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికానికి కంపెనీ నికరలాభం అంతక్రితం ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 11.8 శాతం పెరిగి రూ.5,809 కోట్లకు చేరింది. 2021 సెప్టెంబర్కంటే లాభం 7.7 శాతం వృద్ధిచెందింది. ఈ వృద్ధి 5 శాతం వరకూ ఉండవచ్చన్న విశ్లేషకుల అంచనాల్ని కంపెనీ అధిగమించింది. అలాగే పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం 19.5-20 శాతం పెరగవచ్చని తాజాగా గైడెన్స్ ఇచ్చింది. 2021 అక్టోబర్ నెలలో 16.5-17.5 శాతం గైడెన్స్ను ప్రకటించిన కంపెనీ ఈ దఫా దానిని గణనీయంగా పెంచింది. 17.5-18 శాతం గైడెన్స్ను మార్కెట్ అంచనావేస్తుండగా, దీనిని సైతం ఇన్ఫీ దాటడం గమనార్హం.
‘డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కోసం క్లయింట్లు మాపై ఉంచిన అపారమైన విశ్వాసంతోనే ఈ పటిష్టమైన పనితీరును కనపర్చాం. మార్కెట్ వాటాను పెంచుకున్నాం’
–సలీల్ పారేఖ్, ఇన్ఫోసిస్ సీఈవో
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 55,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటామని ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఒకవైపు ఐటీ సర్వీసులకు భారీ డిమాండ్ నెలకొనడం, 45,000 మంది ఫ్రెషర్ల నియమించనున్నట్లు గతంలో కంపెనీ ప్రకటించగా, ఈ సంఖ్యను తాజాగా పెంచడం గమనార్హం.
డిసెంబర్ క్వార్టర్లో ఇన్ఫోసిస్ నుంచి ఉద్యోగుల వలసలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో 20.1 శాతంగా ఉన్న వలసలు తాజాగా ముగిసిన క్వార్టర్లో 25.5 శాతానికి చేరాయి.