న్యూఢిల్లీ, మే 28: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతుండటంతో ఆటోమొబైల్ రంగంపై ప్రతికూల ప్రభావం చూపనున్నదని ఇండస్ట్రీ వర్గాలు అంచనావేస్తున్నాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.7 వరకు పెంచాయి ఇంధన విక్రయ సంస్థలు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశీయ వాహన విక్రయాలపై ప్రభావం చూపనున్నాయని అశోక్ లేలాండ్ ఎండీ, సీఈవో శేణు అగర్వాల్ తెలిపారు.
జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో ఇటీవల కాలంలో వాహన అమ్మకాలు భారీగా పెరిగాయని, కానీ ప్రస్తుతం ఇంధన ధరలు వేగంతో దూసుకుపోతుండటంతో కొనుగోలుదారులు వెనుకంజ వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ దేశీయ ఆర్థిక మూలాలు స్థిరంగా ఉండటం కొంత సానుకూల ప్రభావం చూపుతున్నాయన్నారు.