హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో ఫార్మా, ఆటో విడిభాగాలు, గనులు, ఖనిజాలు, జౌళి, రెడీమేడ్ దుస్తులు, హార్టికల్చర్ తదితర వివిధ రంగాల్లో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయని గుజరాత్ రెవెన్యూశాఖ మంత్రి రాజేంద్ర త్రివేది అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన వైబ్రంట్ గుజరాత్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్నాయని, ఇక్కడి పారిశ్రామికవేత్తలు తమ రాష్ట్రంలో విస్తరణ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు.
హైదరాబాద్ అందాలకు మంత్రి ఫిదా
హైదరాబాద్ అందమైన నగరమని రాజేంద్ర త్రివేది మెచ్చుకున్నారు. జనవరి 10 నుంచి 12 వరకు నిర్వహించే వైబ్రంట్ గుజరాత్ సదస్సును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐఐ తెలంగాణ చైర్మన్ సమీర్ గోయల్, సీఐఐ మాజీ అధ్యక్షుడు రాజు, గుజరాత్ అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కమల్ ద్యాని, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.