న్యూఢిల్లీ, డిసెంబర్ 12: దేశంలో పారిశ్రామికోత్పత్తి పడకేసింది. ఈ ఏడాది అక్టోబర్లో మైనస్ 4 శాతానికి పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) పతనమైంది. గడిచిన 26 నెలల్లో ఇదే అత్యంత కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. సోమవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల్లో భారతీయ పారిశ్రామిక కార్యకలాపాలు అంతంతమాత్రంగానే సాగుతున్నట్టు తేలింది. ముఖ్యంగా తయారీ రంగం ఉత్పత్తి క్షీణించడం, గనుల రంగంలో వృద్ధి మందగించడం, విద్యుదుత్పత్తిలోనూ నిస్తేజం ఆవరించడం ఐఐపీని దెబ్బతీశాయి. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) ప్రకటించిన ఐఐపీ వివరాల ప్రకారం తయారీ రంగం వృద్ధిరేటు ఈ అక్టోబర్లో మైనస్ 5.6 శాతానికి దిగజారింది. నిరుడు ఇదే నెలలో 3.3 శాతం వృద్ధిని కనబర్చింది. ఇక గనుల రంగంలో వృద్ధి కేవలం 2.5 శాతానికి, విద్యుదుత్పత్తిలో 1.2 శాతం, ప్రైమరీ గూడ్స్-మౌలిక/నిర్మాణ రంగ ఉత్పత్తులు 1 శాతానికి మాత్రమే పరిమితమైంది.
2020 ఆగస్టు తర్వాత ఇదే
2020 ఆగస్టులో ఐఐపీ మైనస్ 7.1 శాతానికి పడిపోయింది. మళ్లీ ఆ తర్వాత ఈ ఏడాది అక్టోబర్లోనే అత్యంత దారుణంగా దిగజారింది. నిజానికి గత ఏడా ది అక్టోబర్లో ఐఐపీ 4.2 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. అయితే ఈసారి మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది. క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి తీరు కూడా 2.3 శాతం తిరోగమనంలోకి జారుకున్నది. నిరుడు కూడా ఇది మైనస్ 1.6 శాతంలోనే ఉండగా, ఈసారి అంతకంటే ఎక్కువగా నీరసించింది. అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మైనస్ 15.3 శాతానికి, నాన్-కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మైనస్ 13.4 శాతానికి పడింది. ఇంటర్మీడియట్ గూడ్స్ ఉత్పాదక రేటు సైతం మైనస్ 2.8 శాతంలోకి జారుకోవడం గమనార్హం.
ఏప్రిల్-అక్టోబర్లోనూ..
ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) ఏప్రిల్-అక్టోబర్లో ఐఐపీ వృద్ధి 5.3 శాతానికే పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఇదే వ్యవధిలో 20.5 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. కాగా, క్షీణించిన భారతీయ ఎగుమతులు ఐఐపీని ప్రభావితం చేశాయని ఐసీఆర్ఏ ప్రధాన ఆర్థికవేత్త అదితీ నాయర్ అన్నారు. ప్రైవేట్ రంగ పెట్టుబడులు ఇంకా పుంజుకోలేదని, ఐఐపీ తాజా గణాంకాలే ఇం దుకు నిదర్శనమని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన ఆర్థికవేత్త మదన్ సబ్నవీస్ అభిప్రాయపడ్డారు.
శాంతించిన ద్రవ్యోల్బణం
రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్లో శాంతించింది. గత నెల 11 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 5.88 శాతానికి దిగింది. ఆహారోత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడం వల్లే వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత చిల్లర ద్రవ్యోల్బణం తగ్గిందని ఎన్ఎస్వో పేర్కొన్నది. ఆహార ద్రవ్యోల్బణం 4.67 శాతం వద్ద ఉన్నది. నిరుడు నవంబర్లో 7.01 శాతంగా ఉన్నది. మరోవైపు గడిచిన 11 నెలల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశిత లక్ష్యం 6 శాతానికి దిగువన రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే తొలిసారి. ఇదిలావుంటే అంతకుముందు నెల అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.77 శాతంగా ఉన్నది. గత ఏడాది నవంబర్లో మాత్రం 4.91 శాతంగా నమోదైంది. దీని ఆధారంగా చూస్తే మాత్రం ఈసారి ద్రవ్యోల్బణ గణాంకాలు ఎక్కువగానే ఉన్నాయనుకోవచ్చు.