Indigo-Turkish Airlines | దేశీయ విమానయాన రంగంలో పట్టు సాధించేందుకు ఎయిర్లైన్స్ మధ్య పోటీ పెరిగినట్లు కనిపిస్తున్నది. ఎయిర్బస్-బోయింగ్ సంస్థల నుంచి 470 విమానాలను కొనుగోలు చేసేందుకు టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా ఒప్పందాలపై సంతకాలు చేసింది. దీంతో దేశంలోనే అతిపెద్ద ఎయిర్లైన్స్ సంస్థ ఇండిగో సంచలన నిర్ణయం తీసుకున్నది. కొత్తగా 500 విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. తన సేవల విస్తరణ కోసం టర్కిష్ ఎయిర్లైన్స్తో నూతన భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది.
ఇప్పటికే ఎయిర్బస్-బోయింగ్ వద్ద సుమారు 500 విమానాలను కొనుగోలు చేయడానికి ఇండిగో ఆర్డర్ చేసింది. ఈ విమానాల రాకతో భారత్ నుంచి ఇస్తాంబుల్, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇండిగో మెరుగైన సేవలు అందించే అవకాశాలు ఉన్నాయి. `ప్రస్తుతం మా వద్ద 1800 విమానాలు ఉన్నాయి. వాటిలో 10 శాతం అంతర్జాతీయ సర్వీసుల నిర్వహణకు ఉపయోగిస్తున్నాం. సుదూర ప్రాంతాలకు విమాన సర్వీసులను నడుపాలని నిర్ణయించాం` ఇండిగో ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా తెలిపారు. భారత ఉపఖండంతోపాటు సమీప దేశాలకు సర్వీసులు నడుపాలని భావిస్తున్నట్లు చెప్పారు. వీటిల్లో బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, ఐర్లాండ్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ దేశాల్లోని ప్రధాన నగరాలు ఉన్నాయి.
టర్కీష్ ఎయిర్లైన్స్తో భాగస్వామ్య ఒప్పందం వల్ల భారత్ నుంచి ఇస్తాంబుల్ వరకు, అక్కడ నుంచి యూరప్లోని 27 కేంద్రాలకు వెళ్లే ప్రయాణికులకు ఇండిగో విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా ఇండిగోకు 76 ఆన్లైన్ పాయింట్లు పని చేస్తున్నాయని వినయ్ మల్హోత్రా పేర్కొన్నారు. త్వరలో కెన్యాలోని నైరోబి, ఇండోనేసియాలోని జకార్తలకు విమాన సర్వీసులను ఇండిగో ప్రారంభించనున్నది.
తన సేవలను విస్తరించడానికి టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా 470 విమానాల కొనుగోలుకు ఎయిర్బస్, బోయింగ్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. బోయింగ్, ఎయిర్బస్ సంస్థలతో వచ్చే దశాబ్దిలో 370 విమానాల కొనుగోలుకు ఆప్షన్స్, పర్చేంజింగ్ రైట్స్ తీసుకున్నది. కొత్తగా 470 విమానాలను కొనుగోలు చేయడంతో ఎయిర్ ఇండియా 6,500 మందికి పైగా కొత్త పైలట్లను నియమించుకోవాల్సి ఉంటుంది.