న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: భారత్ క్యాపిటల్ మార్కెట్ల చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం శుక్రవారం ఆవిష్కృతమయ్యింది. బీఎస్ఈ సెన్సిటివ్ ఇండెక్స్ (సెన్సెక్స్) తొలిసారిగా 60,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. అన్ని వైపుల నుంచి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నక్రమంలో బీఎస్ఈ సెన్సెక్స్ ట్రేడింగ్ ప్రారంభసమయంలోనే 60,000 పాయింట్లస్థాయిని దాటేసి 60,333 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. చివరకు 163 పాయింట్ల లాభంతో 60,048 పాయింట్ల వద్ద ముగిసింది. మరో సూచి నిఫ్టీ 17,948 పాయింట్ల వద్ద నూతన గరిష్ఠస్థాయికి చేరింది. తుదకు 30 పాయింట్ల లాభంతో 17,853 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
మూడు దశాబ్దాల క్రితం 1990లో తొలిసారిగా 1,000 పాయింట్లను చేరిన బీఎస్ఈ సెన్సెక్స్ తాజాగా 60,000 పాయింట్లకు చేరడం ద్వారా ఇన్వెస్టర్లకు 60 రెట్లు లాభాల్ని పంచింది. ఈ చారిత్రాత్మక ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను సునాయాసంగా అధిగమించింది. 1,000 పాయింట్ల నుంచి 2006లో 10,000 పాయింట్లు చేరేందుకు 16 సంవత్సరాల సమయాన్ని సెన్సెక్స్ తీసుకోగా, ఆ తర్వాత 10,000 పాయింట్లను కేవలం ఒకే ఏడాదిలో… అంటే 2007లోనే సాధించి, 20,000 పాయింట్లకు చేరింది. అటుతర్వాత 10,000 పాయింట్ల కోసం 8 సంవత్సరాలు తీసుకుంది. 30,000 పాయింట్ల స్థాయిని 2015లో అందుకుంది. ఆపై 10,000 పాయింట్లు నాలుగేండ్లలో వచ్చాయి. 2009లో 40,000 మార్క్ను చేరిన సెన్సెక్స్…ఆ తర్వాత రెండేండ్లలో 2021 జనవరిలో 50,000 రికార్డును సృష్టించింది.
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాల్ని ప్రతిబింబించే సెన్సెక్స్ 2021 సంవత్సరంలోనే 50,000, 60,000 మైలురాళ్లను అవలీలగా అధిగమించడం గమనార్హం. జనవరి 21న సాధించిన 50,000 పాయింట్ల స్థాయి నుంచి 60,000 వరకూ 10,000 పాయింట్ల సాధనకు కేవలం 167 ట్రేడింగ్ రోజులే పట్టింది. ఇంత తక్కువ సమయంలో 10,000 పాయింట్ల ర్యాలీ ఇదే తొలిసారి. 2015లో తొలిసారిగా 30,000 పాయింట్ల స్థాయిని తాకిన ఈ సూచీ ఆరేండ్లలో రెట్టింపయ్యింది.
‘గత 18 నెలల కొవిడ్ సంక్షోభ సమయంలో భారత్ మార్కెట్దే ప్రపంచంలో అత్యుత్తమ ప్రదర్శన. సెన్సెక్స్ 60,000 పాయింట్లకు చేరి, చరిత్ర సృష్టించిన సందర్బంగా భారత పౌరులకు, ఇన్వెస్టర్లకు అభినందనలు’
-అశీష్కుమార్ చౌహాన్, ఎండీ, సీఈవో, బీఎస్ఈ