న్యూఢిల్లీ, జూన్ 15: ఎగుమతుల వృద్ధికంటే దిగుమతులు అధికంగా పెరగడంతో మే నెలలో భారత్ వాణిజ్యలోటు 24.29 బిలియన్ డాలర్లకు చేరింది. ఒకే నెలలో ఇంత భారీ వాణిజ్యలోటు నమోదుకావడం ఇదే ప్రథమం. బుధవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022 మే నెలలో ఎగుమతులు 20.55 శాతం వృద్ధితో 38.94 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు భారీగా 62.83 శాతం పెరిగి 63.22 బిలియన్ డాలర్లకు ఎగిసాయి. దీంతో వాణిజ్యలోటు 24.29 డాలర్లకు చేరింది. నిరుడు మే నెలలో కరోనా లాక్డౌన్ నియంత్రణల కారణంగా విదేశీ వాణిజ్యం మందగించడంతో 6.53 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటు నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో ఎగుమతులు 25 శాతం వృద్ధితో 78.72 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 45.42 శాతం పెరిగి 123.41 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ రెండు నెలల్లో వాణిజ్య లోటు 44.69 బిలియన్ డాలర్లకు చేరింది.
ఈ ఏడాది మే నెలలో పెట్రోలియం, ముడి చమురు దిగుమతులు ఏకంగా 102.72 శాతం పెరిగి 19.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. బంగారం దిగుమతులు 6 బిలియన్ డాలర్లకు పెరగ్గా, బొగ్గు, కోక్ దిగుమతులు 5.5 బిలియన్ డాలర్ల మేర జరిగాయి. దేశంలోకి దిగుమతైన సర్వీసుల విలువ 45 శాతం వృద్ధితో 14.43 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్, మే నెలల్లో వీటి విలువ 28.48 బిలియన్ డాలర్లకు చేరింది. ఎగుమతుల్లో ఇంజనీరింగ్ ఉత్పత్తులు 12.65 శాతం వృద్ధితో 9.7 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 3.22 బిలియన్ డాలర్ల విలువైన జెమ్స్, జ్యువెలరీ ఎగుమతులు జరిగాయి. 2.5 బిలియన్ డాలర్ల రసాయినాలు, 2 బిలియన్ డాలర్ల ఫార్మా ఉత్పత్తులు, 1.41 బిలియన్ డాలర్ల రెడీమేడ్ దుస్తులు ఎగుమతయ్యాయి.
ఏప్రిల్ నెలకంటే మే నెలలో చమురుయేతర ఎగుమతులు తగ్గడం, బంగారం దిగుమతులు పెరగడం వాణిజ్యలోటు విస్త్రతంకావడానికి మరో కారణమని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్చెప్పారు. అక్షయ తృతీయ సీజన్ అనంతరం పుత్తడి దిగుమతులు తగ్గుతాయన్న అంచనాలకు భిన్నంగా అవి పెరిగాయన్నారు. ప్రస్తుత జూన్ నెలలో వాణిజ్యలోటు కొంత తగ్గవచ్చని అంచనా వేశారు.
వాణిజ్యలోటు భారీగా పెరగడంతో నేరుగా కరెంట్ ఖాతాపై దెబ్బపడుతుంది. దేశంలోకి వచ్చే విదేశీ కరెన్సీ, పోయే విదేశీ కరెన్సీ లావాదేవీల విలువను నమోదు చేసేదానినే కరెంట్ ఖాతాగా వ్యవహరిస్తారు. దిగుమతులకు అధిక డాలర్లను వెచ్చించడంతో వాణిజ్యలోటు పెరుగుతున్నందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 3.5 శాతానికి చేరుతుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. దీనిని 2.5 శాతంలోపు అదుపు చేయాలన్నది రిజర్వ్బ్యాంక్ లక్ష్యం. ఈ ఏడాది విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశం నుంచి డాలర్లను తరలించుకుపోవడం, స్టార్టప్లకు వచ్చే నిధులు తగ్గడంతో 60 బిలియన్ డాలర్ల మేర సమతౌల్య చెల్లింపుల లోటు ఏర్పడవచ్చని అంచనా. ఇది రూపాయి విలువ మరింత తగ్గడానికి దారితీస్తుంది. అయితే భారత్ వద్ద 600 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలున్నందున, రూపాయి వేగంగా పతనంకాకుండా ఆర్బీఐ నిరోధించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి గత ఏడాదికాలంగా ఆర్బీఐ 100 బిలియన్ డాలర్లను మార్కెట్లో విక్రయించింది. రూపాయి క్షీణిస్తే ద్రవ్యోల్బణం మరింతగా ఎగబాకే అవకాశం ఉన్నందున, కరెన్సీ పతనాన్ని సాధ్యమైనంతవరకూ ఆర్బీఐ అడ్డుకుంటుందన్న అంచనాలు మార్కెట్లో ఉన్నాయి. కానీ మార్కెట్ శక్తులకు ఎదురీదితే, భవిష్యత్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.