న్యూఢిల్లీ, నవంబర్ 15: భారత్ వాణిజ్యలోటు అక్టోబర్ నెలలో రికార్డు గరిష్ఠస్థాయికి చేరుకుంది. 2023 సెప్టెంబర్లో 19.37 బిలియన్ డాలర్లున్న ఈ లోటు అక్టోబర్లో ఏకంగా 31.46 బిలియన్ డాలర్లకు పెరిగింది. రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో వాణిజ్యలోటు 20.50 బిలియన్ డాలర్లకు చేరవచ్చన్న ఆర్థికవేత్తల అంచనాల్ని సైతం మించుతూ లోటు ఎగిసిపోయింది.
2022 అక్టోబర్లో ఇది 26.31 బిలియన్ డాలర్లు. ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసాన్ని వాణిజ్యలోటు లేదా మిగులుగా వ్యవహరిస్తారు. ఈ ఏడాది అక్టోబర్లో ఎగుమతులు నిరుడు ఇదేనెలతో పోలిస్తే 6.21 శాతం వృద్ధితో 33.57 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 10 శాతంపైగా పెరిగి 65.03 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. అంతర్జాతీయ చమురు ధరలు పెరగడంతో దేశం దిగుమతుల బిల్లు అధికం కావడానికి ఒక కారణం కాగా, బంగారం దిగుమతులు పెరగడం మరో కారణం. గత నెలలో పుత్తడి దిగుమతులు 2022 అక్టోబర్తో పోలిస్తే 3.70 బిలియన్ డాలర్ల నుంచి 7.23 బిలియన్ డాలర్లకు చేరాయి.
ఇక సర్వీసుల ఎగుమతులు ఈ ఏడాది సెప్టెంబర్లో 29.37 బిలియన్ డాలర్లుకాగా, అక్టోబర్లో ఇవి 28.70 బిలియన్ డాలర్లకు తగ్గాయి. సర్వీసుల దిగుమతులు 14.91 బిలియన్ డాలర్ల నుంచి 14.32 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ మధ్య ఏడు నెలలకాలంలో ఎగుమతులు 7 శాతం క్షీణించి 244.89 బిలియన్ డాలర్లకు తగ్గగా, దిగుమతులు సైతం 8.95 శాతం తగ్గుదలతో 391.96 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. దీంతో 147 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటు నమోదయ్యింది.