Retail Inflation | రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చే మార్చి నాటికి ఆర్బీఐ కంఫర్ట్ జోన్ కంటే తక్కువ స్థాయికి దిగి వస్తుందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. మార్చి రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు శాతానికి తగ్గుతుందని ఎస్బీఐ తన ఎకోరాప్ నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 4.7 శాతం వద్ద నిలిచే అవకాశం ఉందని ఎస్బీఐ ఏకోరాప్ నివేదికను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం 5.72 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే.
నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 5.88 శాతంగా, అక్టోబర్లో 6.77 శాతంగా నమోదైంది. అక్టోబర్ వరకు మూడు త్రైమాసికాలకు పైగా చిల్లర ద్రవ్యోల్బణం ఆరు శాతం కంటే ఎక్కువ నమోదైన సంగతి తెలిసిందే. ఇది ఆర్బీఐ కంఫర్ట్ జోన్ దాటిపోవడంతో కీలక వడ్డీరేట్లను కేంద్రీయ బ్యాంకు పెంచింది.
`డిసెంబర్లో చిల్లర ద్రవ్యోల్బణం 12 నెలల కనిష్టానికి పడిపోయి 5.72 శాతం వద్ద నమోదైంది. సానుకూల వాతావరణం, టెక్నాలజీ సాయంతో పంటల సాగు, భారీగా కూరగాయల ధరలు తగ్గడంతో అంచనాలకు అనుగుణంగానే డిసెంబర్ ద్రవ్యోల్బణం దిగి వచ్చింది` అని ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిస్ట్ అడ్వైజర్ సౌమ్యకాంతి ఘోష్ తెలిపారు. సర్వీస్ రంగంలో అధిక ద్రవ్యోల్బణంతోపాటు కీలక రిటైల్ ద్రవ్యోల్బణం ఆరు శాతానికి పైగానే నమోదైందని కేర్ ఎడ్జ్ చీఫ్ ఎకనమిస్ట్ రజనీ సిన్హా చెప్పారు.
గతేడాది ఆకాశాన్నింటే రీతిలో పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలను అదుపులోకి తేవడానికి ఆర్బీఐ.. 2022 మే నుంచి ఇప్పటి వరకు రెపోరేట్ 225 బేసిక్ పాయింట్లు పెంచేసింది. దీంతో ఆర్బీఐ రెపోరేట్ 6.25 శాతానికి చేరుకున్నది. వడ్డీరేట్లను పెంచేయడంతో ఆర్థిక వ్యవస్థ డిమాండ్లను దెబ్బ తీస్తుందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష.. ఫిబ్రవరి 6-8 మధ్య జరుగనున్నది.