న్యూఢిల్లీ, నవంబర్ 11: ఈ జూలై-సెప్టెంబర్లో చమురు ధరలతోపాటు ఉత్పత్తి సైతం తగ్గడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) నికర లాభం 20 శాతం క్షీణించింది. రూ.10,216 కోట్లుగానే ఉన్నది. నిరుడు లాభం రూ.12,826 కోట్లు. ఏప్రిల్-జూన్లోనూ 34 శాతం తగ్గింది. గత ఏడాది జూలై-సెప్టెంబర్లో ఓఎన్జీసీ సగటున 95.50 డాలర్ల చొప్పున చమురు బ్యారల్ను విక్రయించగా, ఈసారి బ్యారల్కు 84.84 డాలర్లు మాత్రమే సంపాదించగలిగింది. ఏప్రిల్-జూన్లో 76.49 డాలర్లు ఆర్జించింది.
చమురు ధరలు తగ్గడమే నికరలాభం క్షీణతకు ప్రధాన కారణమని ఓఎన్జీసీ డైరెక్టర్ (ఫైనాన్స్) పొమిలా జస్పాల్ చెప్పారు. చమురు, గ్యాస్ ఉత్పత్తి కూడా కొంత తగ్గిందన్నారు. అక్టోబర్-డిసెంబర్లో కేజీ బేసిన్లో ఒక ముఖ్య క్షేత్రం నుంచి ఉత్పత్తిని ప్రారంభించామని, దీంతో లాభాలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
ముగిసిన త్రైమాసికంలో ఓఎన్జీసీ స్థూల ఆదాయం కూడా 8.2 శాతం తగ్గి రూ.35,162 కోట్ల వద్ద నిలిచింది. చమురు ఉత్పత్తి 1.9 శాతం తగ్గుదలతో 4.54 మిలియన్ టన్నులు నమోదుకాగా, గ్యాస్ ఉత్పత్తి 3 శాతం క్షీణించి 5.01 బిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరింది. కొన్ని చమురు, గ్యాస్ క్షేత్రాల్లో నిల్వలు అడుగంటుతున్నందున ఉత్పత్తి తగ్గిందని, ఈ క్షేత్రాల్లో వినూత్న డ్రిల్లింగ్ టెక్నిక్స్తో ఉత్పత్తి పెంచడానికి చర్యలు చేపట్టినట్టు సంస్థ జెస్పాల్ తెలిపారు. అలాగే కొన్ని ప్రాజెక్టుల అభివృద్ధి ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నదని, ఇది పూర్తయిన తర్వాత రానున్న త్రైమాసికాల్లో ఉత్పత్తి పెరుగుతుందన్నారు.