న్యూఢిల్లీ, ఆగస్టు 10: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) లాభాలను గడించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.9,544 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.683 కోట్లతో పోలిస్తే ఎన్నో రెట్లు పెరిగాయి.
ఎల్ఐసీ అసలు వ్యాపారం పనితీరు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, షేర్ల పెట్టుబడుల నుంచి రూ.14 వేల కోట్ల లాభాలను స్వీకరించడం, పాలసీదారుల ఫండ్ నుంచి భారీగా రూ.7,500 కోట్లు బదిలీ చేయడంతో ఈ త్రైమాసికంలో అధిక లాభాన్ని వెల్లడించగలిగింది. కంపెనీ ఆదాయం రూ. 1,88,749 కోట్లకు చేరుకున్నది. కానీ, తొలి ఏడాది ప్రీమియం వసూళ్లు రూ.7,429 కోట్ల నుంచి రూ.6,811 కోట్లకు తగ్గాయి.