న్యూఢిల్లీ : భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో కెనడా నుంచి భారత్కు పప్పుధాన్యాల దిగుమతులు (Lentil Imports) మందగించాయి. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతంలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణల నేపధ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారిన విషయం తెలిసిందే. దౌత్య సంబంధాల విషయంలో ప్రతిష్టంభన నెలకొనడంతో వర్తకంలోనూ పరిమితులు ముందుకొచ్చాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
భారత్కు పప్పుధాన్యాల దిగుమతులు కెనడా నుంచి అత్యధికంగా సమకూరుతున్నాయి. ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన, ఉద్రిక్తతల నేపధ్యంలో కెనడా నుంచి పప్పు ధాన్యాల కొనుగోళ్లను భారత్ తగ్గిస్తే కెనడా రైతులకు ప్రస్తుత సీజన్లో గిట్టుబాటు ధర లభ్యం కాని పరిస్ధితి తలెత్తుతుంది. అదే సమయంలో భారత్లో దేశీ మార్కెట్లో ఆహారోత్పత్తుల ధరలకు రెక్కలొస్తాయి. భారత్ గత ఏడాది గోధుమల ఎగుమతులను నిషేధించగా, ఆపై ధాన్యం సరఫరాలు మెరుగ్గా ఉండేందుకు బాస్మతేతర వైట్ రైస్ ఎగుమతులపైనా నిషేధం విధించింది.
ఇక భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతల నేపధ్యంలో ప్రభుత్వాలు వర్తక ఆంక్షలను విధించే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాల్లో ఆందోళన నెలకొంది. కెనడా నుంచి పప్పుధాన్యాలను కొనుగోలు చేయవద్దని భారత్ అధికారికంగా దిగుమతిదారులను కోరలేదని అధికారులు చెబుతున్నారు. కాగా, కెనడా నుంచి భారత్కు పప్పుధాన్యాల దిగుమతులు ఆరు శాతం పడిపోయాయని కెనడా ఎగుమతుల వ్యాపారి కెవిన్ ప్రైస్ పేర్కొన్నారు. ఇక 2022-23లో భారత పప్పుధాన్యాల దిగుమతుల్లో కెనడా నుంచే దాదాపు 50 శాతం పైగా సమకూరడం విశేషం.
Read More