న్యూఢిల్లీ, మార్చి 12: దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు ఈ ఏడాది జనవరిలో 3.8 శాతానికి మందగించింది. ప్రధానంగా తయారీ, గనులు, విద్యుత్తు రంగాల పేలవ ప్రదర్శన వల్లేనని మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాల్లో తేలింది. ఇక గత ఏడాది జనవరిలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 5.8 శాతంగా నమోదవడం గమనార్హం. నిరుడు డిసెంబర్లోనూ 4.2 శాతంగా ఉన్నది. దీంతో ఈ జనవరిలో అంతకుముందు నెలతో పోల్చినా.. ఏడాది క్రితం గణాంకాలతో చూసినా తగ్గిందనే చెప్పుకోవచ్చు.
అన్నింటా పతనమే..
ఈసారి తయారీ రంగంలో ఉత్పాదకత వృద్ధి 3.2 శాతం క్షీణించింది. నిరుడు జనవరిలో 4.5 శాతంగా ఉన్నదని కేంద్ర గణాంకాలు, కార్యాచరణ అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది. విద్యుత్తు రంగంలోనూ 12.7 శాతం నుంచి 5.6 శాతానికి పడిపోయింది. గనుల రంగంలో ఉత్పాదక వృద్ధిరేటు 9 శాతం నుంచి 5.9 శాతానికి దిగొచ్చింది. క్యాపిటల్ గూడ్స్ సెగ్మెంట్ వృద్ధిరేటు కూడా 10.5 శాతం నుంచి 4.1 శాతానికి పతనమైంది. మౌలిక/నిర్మాణ రంగ ఉత్పత్తుల తయారీ కూడా 11.3 శాతం నుంచి 4.6 శాతానికి కుదేలైంది. ఇక ప్రైమరీ గూడ్స్ ఔట్పుట్ 9.8 శాతం నుంచి 2.9 శాతానికి, కన్జ్యూమర్ నాన్-డ్యూరబుల్ గూడ్స్ ఉత్పాదకత 6.5 శాతం నుంచి 0.3 శాతానికి దిగజారింది. దీంతో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఔట్పుట్ 10.9 శాతానికి, ఇంటర్మీడియెట్ గూడ్స్ సెగ్మెంట్ 4.8 శాతానికి పెరిగినా ఫలితం లేకపోయింది.
5.09 శాతంగా ద్రవ్యోల్బణం
ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.09 శాతంగా నమోదైంది. ఇది నాలుగు నెలల కనిష్ఠమని మంగళవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యోల్బణాన్ని 6 శాతం దిగువనే ఉంచాలన్న లక్ష్యం పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ స్థాయి దిగువనే నమోదవడం ఇది వరుసగా ఆరో నెల. కాగా, వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ఈ ద్రవ్యోల్బణం జనవరిలోనూ 5.1 శాతంగానే ఉన్నది. అయితే ఆహారోత్పత్తుల ధరల సూచీ గతంతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. జనవరిలో 8.3 శాతంగా ఉంటే.. ఫిబ్రవరిలో 8.66 శాతంగా ఉన్నట్టు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) తెలిపింది. కూరగాయలు, పండ్లు, వంటనూనెలు, పప్పుల ధరలు తగ్గినా.. తృణధాన్యాలు, చేపలు, మాంసం, పాల ఉత్పత్తుల ధరలు పెరిగాయి. సీపీఐ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణంలో ఆహారోత్పత్తుల ధరల సూచీ వాటానే 50 శాతంగా ఉంటుంది.