న్యూఢిల్లీ, జనవరి 9: భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతం వృద్ధి సాధిస్తుందని, 2025-26లో ఇది 6.5 శాతానికి పుంజుకుంటుందని ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాల్లో పేర్కొంది. ప్రస్తుత 2023-24లో 6.3 శాతం వృద్ధిచెందుతుందని అంచనా వేసింది. అయితే గత ఏడాది జూన్లో ప్రకటించిన అంచనాలనే యథాతథంగా అట్టిపెట్టింది. బ్యాంక్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ మంగళవారం విడుదల చేసింది. పటిష్టమైన సర్వీసుల రంగం, పెట్టుబడులు మద్దతుగా నిలుస్తున్నందున వేగంగా వృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ తన హోదాను నిలుపుకుంటుందని రిపోర్ట్లో వివరించింది. బ్యాంకింగ్ రంగంతో సహా కార్పొరేట్ల బ్యాలెన్స్ షీట్స్ మెరుగయ్యాయని, అధిక ప్రభుత్వ పెట్టుబడులు ఊతమిస్తున్నాయని తెలిపింది.
ఆర్థికాభివృద్ధి 6.2 శాతం: యూబీఎస్
భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతం వృద్ధి సాధించవచ్చని విదేశీ బ్రోకరేజ్ యూబీఎస్ అంచనా వేసింది. అంతర్జాతీయ సవాళ్లున్నా, రానున్న ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 6.2 శాతం వృద్ధితో 3.9 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని, ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది 7 శాతం వృద్ధితో 3.57 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని యూబీఎస్ చీఫ్ ఎకనామిస్ట్ తన్వీ గుప్తా జైన్ ఒక తాజా నోట్లో వివరించారు. వ్యవస్థలో మూలధన పెట్టుబడులు పెరుగుతాయని, ప్రభుత్వ పెట్టుబడుల కాస్త తగ్గినా, ఎన్నికల తర్వాత ప్రైవేటు కార్పొరేట్ పెట్టుబడులు అధికంగా ఉంటాయని జైన్ పేర్కొన్నారు. 2025-26 నుంచి 2029-30 వరకూ భారత్ మధ్యకాలికంగా 6.5 శాతం చొప్పున వృద్ధిచెందుతుందని, జీడీపీ 6 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉన్నదని తెలిపారు.