GST collections : దేశంలో వస్తుసేవల పన్ను (GST) వసూళ్లు నిలకడగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది మే నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.94 లక్షల కోట్లుగా నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance Ministry) సోమవారం ప్రకటించింది. గత సంవత్సరం ఇదే నెలలో వసూలైన రూ.1.88 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్ల (GST collections) తో పోలిస్తే ఇది 3.2 శాతం అధికమని తెలిపింది. రిఫండ్లను సర్దుబాటు చేసిన తర్వాత నికర జీఎస్టీ ఆదాయం (GST Income) రూ.1.67 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 3.3 శాతం ఎక్కువ.
ఏప్రిల్లో నమోదైన రికార్డు స్థాయి రూ.2.43 లక్షల కోట్ల వసూళ్లతో పోలిస్తే మే నెలలో ఆదాయం తగ్గింది. అయితే ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరం ముగింపు తర్వాత మే నెలలో వసూళ్లు తగ్గడం సాధారణమేనని అధికారులు తెలిపారు. ఈసారి జీఎస్టీ వసూళ్లలో దిగుమతులు కీలక పాత్ర పోషించాయి. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన జీఎస్టీ ఆదాయం 2.6 శాతం తగ్గి సుమారు రూ.1.34 లక్షల కోట్లుగా నమోదు కాగా.. దిగుమతులపై జీఎస్టీ వసూళ్లు 19.1 శాతం పెరిగి రూ.59,654 కోట్లకు చేరుకోవడం గమనార్హం.
మే నెలలో మొత్తం రిఫండ్లు 2.6 శాతం పెరిగి రూ.27,281 కోట్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి రెండు నెలల్లో (ఏప్రిల్-మే) స్థూల జీఎస్టీ వసూళ్లు 6.2 శాతం వృద్ధితో రూ.4.37 లక్షల కోట్లకు చేరాయి.