Tax Collections | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇప్పటి వరకు స్థూలంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.6.53 లక్షల కోట్లు వసూలయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 10 నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 15.7 శాతం గ్రోత్ నమోదైందని ఆదాయం పన్ను విభాగం శుక్రవారం వెల్లడించింది. మొత్తం పన్ను వసూళ్లలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5.84 లక్షల కోట్లుగా ఉన్నాయి.
గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రత్యక్ష పన్ను వసూళ్లలో గ్రోత్ రేట్ స్థిరంగా కొనసాగుతున్నదని ఆదాయం పన్ను విభాగం తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాల ప్రకారం పన్ను వసూళ్లు 17.33 శాతం ఎక్కువ. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ నెల 10 వరకు రూ.69 వేల కోట్లు.. రీఫండ్ చేసినట్లు ఐటీ విభాగం పేరెంట్ సంస్థ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రీఫండ్స్ 3.73 శాతం ఎక్కువ అని సీబీడీటీ వెల్లడించింది.