న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నా.. దేశంలో బంగారానికి ఆదరణ మాత్రం తగ్గడం లేదు. ఈ జనవరి-మార్చి త్రైమాసికం (క్యూ1)లో 136.6 టన్నులు (ఆభరణాలు, పెట్టుబడులు తదితరాలన్నీ కలిపి)గా నమోదైంది. గతంతో పోల్చితే 8 శాతం పెరగడం గమనార్హం. నిరుడు జనవరి-మార్చిలో 126.3 టన్నులే. ఇక మంగళవారం విడుదలైన ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) నివేదిక ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ క్యూ1 2024’ ప్రకారం భారతీయ గోల్డ్ డిమాండ్ విలువ వార్షిక ప్రాతిపదికన 20 శాతం ఎగిసి రూ.75,470 కోట్లుగా నమోదైంది. నిరుడు రూ.63,090 కోట్లు. ఈ ఏడాది తొలి 3 నెలల్లో ధరల సగటు కూడా 11 శాతం ఎగబాకడం విశేషం. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పెద్ద ఎత్తున చేస్తున్న పసిడి కొనుగోళ్లు కూడా డిమాండ్ పెరుగుదలకు కారణమవుతున్నదని డబ్ల్యూజీసీ ఈ సందర్భంగా అభిప్రాయపడింది.
ఆభరణాల రూపంలో భౌతిక బంగారాన్ని కొనేందుకు ఇష్టపడుతున్న భారతీయులు.. పెట్టుబడులపైనా అంతే ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే కడ్డీలు, నాణేలు, ఈటీఎఫ్ వంటి ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్కు డిమాండ్ పెరిగినట్టు డబ్ల్యూజీసీ ఇండియా విభాగం ప్రాంతీయ సీఈవో సచిన్ జైన్ తెలిపారు. గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి 2 టన్నులకుపైగా వచ్చాయన్నారు. ఆర్బీఐ కూడా బంగారం కొనుగోళ్లకు దిగుతుండటంతో సహజంగానే డిమాండ్ ఇంకా పెరుగుతోందని చెప్పారు. అయితే ప్రస్తుత ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో గోల్డ్ డిమాండ్ దేశంలో తగ్గవచ్చన్న సచిన్.. పెరుగుతున్న ధరలు, లోక్సభ ఎన్నికలే కారణమన్నారు.
ఈ జనవరి-మార్చిలో అంతర్జాతీయంగా కూడా గోల్డ్ డిమాండ్ 3 శాతం పెరిగింది. 1,238 టన్నులకు చేరింది. 2016 తర్వాత ఓ త్రైమాసికంలో ఈ స్థాయిలో పుత్తడికి ఆదరణ కనిపించడం ఇదే తొలిసారి అని డబ్ల్యూజీసీ తెలిపింది. ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు, ఆసియా దేశాల కొనుగోలుదారుల నుంచి డిమాండ్తో ధరలు ఎక్కువగా ఉన్నా.. గిరాకీ తగ్గలేదన్నది. ఇక గ్లోబల్ మార్కెట్లో ఔన్సు గోల్డ్ రేటు సగటున 2,070 డాలర్లు పలికింది. నిరుడుతో పోల్చితే 10 శాతం, గత త్రైమాసికంతో చూస్తే 5 శాతం ఎక్కువ.
‘బంగారంపట్ల భారతీయులకున్న ఇష్టానికి తాజా గణాంకాలు అద్దం పడుతున్నాయి. ఇక్కడి పండుగలు, వివాహాది శుభకార్యాలతో పసిడికి విడదీయరాని బంధం ఉన్నది. ఈసారి వర్షాలు సమృద్ధిగా పడితే గోల్డ్ డిమాండ్ ఇంకా పెరుగుతుంది. నిజానికి ధరలు తగ్గితే భారత్, చైనాల్లో డిమాండ్ కనిపిస్తుంది. కానీ తొలిసారి రేట్లు పెరుగుతున్నా.. ఆదరణ మాత్రం కొనసాగుతూనే ఉన్నది’
-సచిన్ జైన్, డబ్ల్యూజీసీ ఇండియా ప్రాంతీయ సీఈవో
దేశీయ స్పాట్ మార్కెట్లో మంగళవారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ పసిడి విలువ రూ.150 దిగి రూ.72,600గా ఉన్నది. కిలో వెండి ధర కూడా రూ.750 క్షీణించి రూ.83,750గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ 13 డాలర్లు పతనమై 2,320 డాలర్లుగా ఉన్నది. వెండి 26.80 డాలర్లకు పరిమితమైంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ తులం రూ.72,600, 22 క్యారెట్ రూ.66,550గా ఉన్నాయి. కిలో వెండి రేటు మాత్రం సోమవారంతో పోల్చితే రూ.500 తగ్గి రూ.83,500గా ఉన్నది.