Gold | బంగారం ధరలు ధగధగ మెరుస్తున్నా.. గిరాకీ మాత్రం తగ్గడం లేదు. 2022-23తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో పసిడికి గిరాకీ ఎనిమిది శాతం పెరిగి 136.6 టన్నులకు చేరిందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) వెల్లడించింది. బలమైన ఆర్థిక పరిస్థితులతోపాటు ఆర్బీఐ భారీగా బంగారం కొనుగోలు చేయడం కూడా గిరాకీ పుంజుకోవడానికి కారణం అని డబ్ల్యూజీసీ ఇండియా సీఈఓ సచిన్ జైన్ చెప్పారు. 2023లో 16 టన్నుల బంగారం కొనుగోలు చేసిన ఆర్బీఐ.. కేవలం మార్చి త్రైమాసికంలోనే 19 టన్నులు కొనుగోలు చేసిందన్నారు. మున్ముందు బంగారం కొనుగోళ్లు కొనసాగిస్తామని ఆర్బీఐ సంకేతాలిచ్చిందని చెప్పారు.
2022-23 మార్చి త్రైమాసికంతో పోలిస్తే 2023-24 జనవరి-మార్చి త్రైమాసికంలో బంగారా (Gold)నికి గిరాకీ విలువ పరంగా 20 శాతం గ్రోత్తో రూ.75,470 కోట్లు చేరుకున్నది. మొత్తం బంగారం గిరాకీలో ఆభరణాల విలువ నాలుగు శాతం పుంజుకుని 95.5 టన్నుల కొనుగోళ్లు జరగ్గా, పెట్టుబడి కోసం జరిపే బంగారం కొనుగోళ్లు 19 శాతం పెరిగి 41.1 టన్నుల వద్ద నిలిచింది. దేశంలో బలమైన స్థూల ఆర్థిక వాతావరణం వల్లే బంగారం ఆభరణాల గిరాకీకి దోహద పడిందని, అయితే, మార్చిలో ఒక్కసారిగా ధరలు పెరగడంతో సేల్స్ తగ్గాయని సచిన్ జైన్ వెల్లడించారు. ఈ ఏడాది మొత్తంలో బంగారం డిమాండ్ 700-800 టన్నులకు చేరుతుందని అంచనా వేశారు.
పాశ్చాత్య మార్కెట్లో ధరలు పెరిగితే బంగారానికి డిమాండ్ పెరుగుతుందని సచిన్ జైన్ పేర్కొన్నారు. మామూలుగా బంగారం ధరలు తగ్గితే భారత్, చైనా మార్కెట్లలో కొనుగోళ్లు పెరుగుతాయన్నారు. కానీ ఈసారి అందుకు భిన్నమైన ధోరణి నెలకొందన్నారు. ఆభరణాలతోపాటు బంగారం బిస్కట్లు, నాణాలు, ఈటీఎఫ్లకు కూడా డిమాండ్ పెరిగిందన్నారు. ఇక బంగారం ఆభరణాల విలువ పరంగా 15 శాతం గ్రోత్తో రూ.52,750 కోట్లు, పెట్టుబడుల వాటా 32 శాతం పుంజుకుని రూ.22,720 కోట్లకు దూసుకెళ్లింది. మొత్తం మార్చి త్రైమాసికంలో బంగారం కొనుగోళ్లు 20 శాతం పెరిగి రూ.75,470 కోట్లకు చేరుకున్నది. 2023-24 మార్చి త్రైమాసికంలో బంగారం దిగుమతులు 25 శాతానికి పెరిగి 179.4 టన్నులకు చేరుకున్నాయి.