Arvind Panagaria | భారత ప్రగతి, ఆర్థిక వ్యవస్థపై నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 నాటికి దేశ జీడీపీ ఐదు లక్షల డాలర్లకు చేరుతుందని, తద్వారా ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని చెప్పారు. అటుపై 2027లో 5.5 లక్షల కోట్ల డాలర్లకు భారత్ ఆర్థిక వ్యవస్థ చేరుతుందన్నారు. సీడీ దేశ్ ముఖ్ 18వ స్మారకోపన్యాసం చేస్తూ అరవింద్ పనగరియా ఈ వ్యాఖ్యలు చేశారు.
వచ్చే మూడేండ్లలో భారత్ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లతో జర్మనీ లేదా జపాన్’ను అధిగమిస్తుందని అరవింద్ పనగరియా చెప్పారు. అదే సమయంలో జపాన్ జీడీపీ సుస్థిర గ్రోత్ సాధిస్తూ 2022లో 4.2 లక్షల కోట్ల డాలర్ల నుంచి 2027 నాటికి 5.03 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందన్నారు. జర్మనీ జీడీపీ ఏటా నాలుగు శాతం చొప్పున 2023లో 4.4 లక్షల కోట్ల నుంచి 2026కల్లా 4.9 లక్షల కోట్లకు, 2027లో 5.1 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా వేశారు.
దీని ప్రకారం భారత్ జీడీపీ వ్రుద్ధిరేటు ఏటా 10.22 శాతం చొప్పున పెరుగుతూ ప్రస్తుత డాలర్ విలువ ప్రకారం 2026లో ఐదు లక్షల కోట్ల డాలర్లకు, 2027లో 5.5 లక్షల కోట్ల డాలర్లకు దూసుకెళ్తుందని అరవింద్ పనగరియా చెప్పారు. 2026 చివరికల్లా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు. ఈ లక్ష్య సాధన కోసం అవసరమైన చర్యలు తప్పనిసరి చర్యలు చేపట్టాలని చెప్పారు. ఇందుకోసం చిన్న భూకమతాలను, చిన్న సంస్థలను ఇతర సంస్థల్లో విలీనం చేయాలని సూచించారు. పరిశ్రమలు, సర్వీస్ రంగంలో సంస్కరణలు అమలు చేయడంతో వల్ల సామాన్య ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. దీనివల్ల గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు ఎక్కువ అవుతాయన్నారు.