న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఈ ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ 7.5-8 శాతం మేర వృద్ధిచెందుతుందని, ఇందులో ఎగుమతులు కీలకపాత్ర వహిస్తాయని సీఐఐ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ చెప్పారు. అయితే కొవిడ్ తదుపరి వేవ్ను, అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుత ఏడాది ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అధికంగా ఉంటుందన్న విశ్వాసం ఉందని, ఎగుమతుల పట్ల చాలా ఆశాభావంతో ఉన్నామన్నారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగా కొవిడ్ తాజావేవ్ వచ్చిన ప్రతీసారీ భారత్ను కూడా తాకుతున్నదని గుర్తుచేశారు.
అందుచేత భవిష్యత్తు కొవిడ్ వేవ్స్ను ఎదుర్కొనేందుకు మనం సంసిద్ధమై ఉండాలన్నారు. కానీ దేశంలో భారీస్థాయిలో లాక్డౌన్లు ఉంటాయని సీఐఐ భావించడం లేదని చెప్పారు. కఠినమైన లాక్డౌన్లు విధించేబదులు, కొవిడ్ను అదుపుచేసే సూత్రాల్ని ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్నట్టు తెలిపారు. చమురు, ఇతర కమోడిటీ ధరల పెరుగుదలను ఆయన ప్రస్తావిస్తూ పరిశ్రమల లాభాల మార్జిన్లు, వినియోగదారుల కొనుగోలు శక్తిపై ప్రభావం పడుతుందని, కానీ ద్రవ్యోల్బణం మాత్రం ఆర్బీఐ నిర్దిష్ఠ శ్రేణిలోనే ఉంటుందని అంచనా వేస్తున్నామని నరేంద్రన్ వివరించారు.
రష్యా-ఉక్రెయిన్లతో భారత్ ఆర్థిక సంబంధాలు తక్కువే అయినా, అనుసంధాన ప్రపంచంలో జీవిస్తున్నందున యుద్ధ ప్రభావం నుంచి ఏ దేశం తప్పించుకోలేదన్నారు. క్రూడ్తో పాటు బొగ్గు, స్టీల్ ధరలు పెరుగుతాయని, దీంతో పలు పరిశ్రమల ఉత్పాదక వ్యయాలు అధికమవుతాయన్నారు.
జీడీపీకి యూబీఎస్ కోత
ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి రేటును అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యూబీఎస్ తగ్గించింది. అధిక కమోడిటీ ధరలు, దేశీయంగా బలహీనపడిన డిమాండ్ కారణంగా వృద్ధి రేటును 70 బేసిస్ పాయింట్లు (0.7 శాతం) తగ్గించి 7 శాతంగా అంచనా వేస్తున్నట్టు శుక్రవారం యూబీఎస్ తెలిపింది. భారత్ 7.7 శాతం వృద్ధిని సాధించవచ్చని గత అంచనాల్లో యూబీఎస్ పేర్కొంది. ఉక్రెయిన్ సంక్షోభంతో ద్రవ్యోల్బణం రిస్క్ పెరగడం, సరఫరా అవరోధాలు తీవ్రతరంకావడంతో భారత్తో పాటు దక్షిణాసియా మొత్తం ఆర్థికాభివృద్ధి రేటు అంచనాల్ని ప్రపంచబ్యాంక్ భారీగా తగ్గించిన కొద్ది రోజులకే యూబీఎస్ ప్రకటన వెలువడటం గమనార్హం. అధిక ఇంధన ధరలతో భారత్లో ఉత్పత్తులకు డిమాండ్ బలహీనంగా ఉంటుందని, ద్రవ్యోల్బణం ఒత్తిడులు పెరుగుతాయని యూబీఎస్ పేర్కొంది.