న్యూఢిల్లీ, జనవరి 7: ఈ ఆర్థిక సంవత్సరం (2021-22)లో దేశ జీడీపీ 9.2 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. శుక్రవారం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) జాతీయ ఆదాయంపై తమ తొలి ముందస్తు అంచనాలను విడుదల చేసింది. వ్యవసాయం, గనులు, తయారీ రంగాల్లో మెరుగైన ప్రదర్శన కారణంగా ఈసారి వృద్ధిరేటు గతంతో పోల్చితే పెరుగుతుందని చెప్పింది. అన్ని రంగాల్లో బలమైన వృద్ధి కనిపిస్తున్నదన్నది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఒమిక్రాన్ ప్రభావంతో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నా.. వృద్ధిరేటుకు ఢోకా లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కరోనాకు ముందున్న 2019-20తో పోల్చితే ఈ 2021-22లో జీడీపీ విలువ మరింత పెరిగి రూ.147.54 లక్షల కోట్లను తాకుతుందని అంచనా వేసింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే భారతేనని స్పష్టం చేసినైట్టెంది. అయితే ఎన్ఎస్వో తాజా అంచనా 9.2 శాతం.. గత నెల ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ అంచనా 9.5 శాతం కంటే తక్కువగానే ఉన్నది.