న్యూఢిల్లీ, నవంబర్ 30: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు మందగించింది. తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) నాలుగేండ్ల గరిష్ఠస్థాయి 7.8 శాతానికి చేరిన జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్తో ముగిసిన 3 నెలల కాలంలో 7.6 శాతానికి తగ్గినట్టు గురువారం జాతీయ గణాంకాల శాఖ (ఎన్ఎస్వో) విడుదల చేసిన డాటా వెల్లడిస్తున్నది. అయితే అత్యధిక శాతం విశ్లేషకుల అంచనాల్ని అధిగమించడం గమనార్హం. 2023-24 జూలై-సెప్టెంబర్లో జీడీపీ 6.7 శాతం పెరగవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. అలాగే వృద్ధి 6.5 శాతం ఉంటుందని రిజర్వ్బ్యాంక్ ఇటీవలి అంచనాల్లో పేర్కొంది. 2011-12 స్థిర ధరల ప్రకారం ఈ క్యూ2లో జీడీపీ 41.74 లక్షల కోట్లకు చేరినట్టు ఎన్ఎస్వో తెలిపింది. 2022-23 జూలై-సెప్టెంబర్లో (6.2 శాతం వృద్ధి) ఇది రూ.38.78 లక్షల కోట్లు. దీనితో పోలిస్తే తాజా త్రైమాసికంలో 7.6 శాతం వృద్ధిచెందింది. ప్రస్తుత ధరల ప్రకారం జీడీపీ రూ. 65.67 లక్షల కోట్ల నుంచి రూ.71.66 లక్షల కోట్లకు పెరిగింది. ఈ వృద్ధి 9.1 శాతంకాగా, 2022-23 క్యూ2లో వృద్ధిరేటు 17.2 శాతంతో పోలిస్తే ప్రస్తుత ధరల ప్రకారం తాజా త్రైమాసికంలో మందగించింది.
తాజాగా ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో తయారీ రంగం 13.9 శాతం వృద్ధిచెందింది. మైనింగ్ రంగం 10 శాతం పెరగ్గా, వ్యవసాయ రంగం వృద్ధి 1.2 శాతానికే పరిమితమయ్యింది. ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్ రంగాల వృద్ధి నిరుడు ఇదే త్రైమాసికంతో పోలిస్తే 7.1 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. విద్యుత్, గ్యాస్, ఇతర యుటిలిటీ సర్వీసుల వృద్ధి రేటు 6.1 శాతం నుంచి 10.1 శాతానికి పెరిగింది. నిర్మాణ రంగం వృద్ధి రేటు 5.7 శాతం నుంచి 13.3 శాతానికి చేరింది.
ప్రస్తుత పూర్తి ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో నిర్దేశించుకున్న ద్రవ్యలోటు లక్ష్యంలో అక్టోబర్కల్లా 45 శాతానికి చేరుకుంది. గురువారం కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం అక్టోబర్ చివరినాటికి రూ. 8.03 లక్షల కోట్లు ద్రవ్యలోటు నమోదయ్యింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును రూ. 17.86 లక్షల కోట్లకు అదుపు చేయాలని బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రభుత్వ వ్యయం, రెవిన్యూ మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా పరిగణిస్తారు. నిరుడు ఇదేకాలంలో ఈ లోటు బడ్జెట్ అంచనాల్లో 45.6 శాతానికి చేరింది. 2023-24 బడ్జెట్ అంచ నా వసూళ్లలో ప్రభుత్వం అక్టోబర్ చివరినాటికి రూ.15.9 లక్షల కోట్లు (58.6 శాతం) సమీకరించింది. అందులో రూ.13.01 లక్షల కోట్లు పన్ను వసూళ్లుకాగా, రూ.2.65 లక్షల కోట్లు పన్నుయేతర ఆదాయం, ఇతర ఆదాయం రూ.22,990 కోట్లు ఉన్నాయి. ఈ ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో ప్రభుత్వ వ్యయం రూ.23.94 లక్షల కోట్లకు (బడ్జెట్ అంచనాల్లో 53 శాతం) చేరుకున్నట్టు సీజీఏ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.