న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో కుదేలైన దేశ ఆర్ధిక వ్యవస్ధ క్రమంగా పుంజుకుంటోంది. 2022 ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత జీడీపీ అంచనాలకు అనుగుణంగా 8.45 శాతం వృద్ధి కనబరిచింది. ఆర్ధిక కార్యకలాపాలు వేగవంతం కావడంతోనే జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ప్రోత్సాహకరంగా నమోదైంది.
వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకోవడం, నిత్యావసరాలు, వస్తువినిమయ గిరాకీ, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఊపందుకున్న కార్యకలాపాలు కూడా వృద్ధి రేటుకు ఊతమిచ్చాయి. గత ఏడాది ఇదే క్వార్టర్లో మహమ్మారి దెబ్బకు లాక్డౌన్లు విధించడంతో జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతం తగ్గింది.
ఇక 2021-22 రెండో క్వార్టర్లో లో బేస్ ఎఫెక్ట్ కూడా అధిక వృద్ధి నమోదుకు దారితీసింది. మరోవైపు దేశంలో రికవరీ రేటు ప్రోత్సాహకరంగా ఉన్నా ధరల మంట, అధిక వడ్డీరేట్లు, జాబ్ రికవరీ మందకొడిగా ఉండటం అవరోధాలుగా ఆర్ధిక నిపుణులు పేర్కొంటున్నారు.