న్యూఢిల్లీ, మార్చి 31: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దేశీయ ఎలక్ట్రానిక్స్ పరికరాలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్నది. జీఎస్టీ రేటు తగ్గడంతో భారీ ఉపశమనం పొందిన కస్టమర్లకు యుద్ధం గట్టి షాకిచ్చింది. ఎంట్రీ లెవల్ ఎలక్ట్రానిక్ పరికరాలతోపాటు అన్ని రకాల ఉత్పత్తుల ధరలు భారీగా పెరుగబోతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు, టీవీలు, ఏసీ, వాషింగ్ మెషిన్ల ధరలు 10 శాతానికి పైగా పెంచడానికి కంపెనీలు రెడీ అవుతున్నాయి. ఉత్పత్తి వ్యయం అధికం కావడంతోపాటు రూపాయి విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోవడం కారణంగా తమపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలను సవరించాల్సి వస్తున్నదని సంస్థలు ప్రకటిస్తున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్లు అయిన వివో, ఒప్పో, సామ్సంగ్, షియోమీలు తమ మాడళ్ల ధరలను 10 శాతం వరకు పెంచుతున్నట్టు ఇప్పటికే సంకేతాలిచ్చాయి.
మళ్లీ ఎంట్రీ లెవల్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ధరలు ఆరు నుంచి ఎనిమిదేండ్ల కిందటి స్థాయికి చేరుకోబోతున్నాయి. దశాబ్దకాలం క్రితం స్మార్ట్ఫోన్, టీవీలు, ఏసీల ధరలు గరిష్ఠ స్థాయిలో ఉండేవి. ఆ తర్వాత కాలంలో టెక్నాలజీ రంగంలో వచ్చిన పెనుమార్పులకు తోడు దేశీయ తయారీ వ్యవస్థను ప్రోత్సహించడానికి కేంద్రం తీసుకొచ్చిన పీఎల్ఐ స్కీమ్తో వీటి ధరలు భారీగా పడిపోయాయి. మళ్లీ ఇప్పుడు అదే స్థాయికి చేరుకోనున్నాయి. వచ్చే నెలలో ధరల గరిష్ఠ స్థాయిలో పెరుగనున్నాయని గోద్రెజ్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు.
పలు గ్లోబల్ బాండ్లు తమ ఉత్పత్తుల ధరలను పది శాతం వరకు పెంచబోతున్నాయి. వచ్చే జూన్ నాటికి 5జీ ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్ ధర రూ.20 వేలకు చేరుకోనున్నది. ప్రస్తుతం ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. భవిష్యత్తులో క్యాష్బ్యాక్ ఆఫర్లు, ట్రేడ్ ప్రమోషన్లకు చెక్పడే అవకాశాలు ఉన్నాయి.
– కైలాష్ లక్ష్యాని, ఆల్ ఇండియా మొబైల్
రిటైలర్స్ అసోసియేషన్ చైర్మన్