Moody’s | న్యూఢిల్లీ, మార్చి 4: అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ప్రస్తుత 2024 క్యాలండర్ సంవత్సరానికి భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాల్ని 6.8 శాతానికి పెంచింది. గతంలో ప్రకటించిన అంచనా 6.1 శాతంగా ఉన్నది. పటిష్ఠమైన ఆర్థిక గణాంకాలు వెలువడుతున్నాయని, జీ-20 దేశాల్లోకెల్లా భారత్ వేగవంతమైన వృద్ధిని సాధిస్తుందని మూడీస్ అనుబంధ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. 2025 సంవత్సరంలో 6.4 శాతం వృద్ధిని ప్రదర్శించవచ్చని అంచనా వేసింది. 2023 క్యాలండర్ సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో జీడీపీ 8.4 శాతం వృద్ధిచెందడంతో పూర్తి క్యాలండర్ సంవత్సరంలో ఇది 7.7 శాతానికి చేరింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 8.2 శాతం, జూలై-సెప్టెంబర్ మూడు నెలల కాలంలో 8.1 శాతం చొప్పున వృద్ధిచెందిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు ఖర్చుచేయడం, తయారీ రంగం కార్యకలాపాలు మెరుగుకావడంతో 2023లో వృద్ధి జోరందుకుందని మూడీస్ వివరించింది. సెప్టెంబర్-డిసెంబర్లో కనపర్చిన వృద్ధివేగం 2024 మార్చి త్రైమాసికంలోకి విస్తరిస్తుందన్న సంకేతాలు కన్పిస్తున్నాయన్నది.
జీఎస్టీ వసూళ్ల జోరు, ఆటో అమ్మకాల వృద్ధి, రెండంకెల్లో బ్యాంక్ రుణాల పెరుగుదల తదితర అంశాలు పట్టణ వినియోగం, డిమాండ్ చెక్కుచెదరలేదని వెల్లడిస్తున్నాయన్నది. మరోవైపు తయారీ, సేవల రంగాల పీఎంఐల (పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్లు) ఆర్థిక వ్యవస్థ పరుగును సూచిస్తున్నాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ నివేదిక పేర్కొంది. ఇండియాతో సహా పలు జీ-20 దేశాలకు 2024 ఎన్నికల సంవత్సరమని, ఈ ఏడాది ఎన్నుకోబడిన నేతల ప్రభావం వచ్చే నాలుగైదేండ్లు దేశీయ, విదేశీ విధానాలపై ఉంటుందని, మారే రాజకీయ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాలు స్పందిస్తాయని వివరించింది.