Finance Ministry on Interest Rates | పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు పెంచితే దేశ ఆర్థిక రంగ వృద్ధి నెమ్మదిస్తుందని కేంద్రం పేర్కొంది. ఒకవేళ ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచితే వృద్ధి రేటు నెమ్మదిస్తుందని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ పేర్కొన్నారు. వచ్చేనెల 6-8 తేదీల్లో జరిగే ద్రవ్య పరపతి కమిటీ సమీక్షలో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను పెంచేందుకు సన్నాహాలు చేస్తుందని వార్తలొస్తున్నాయి.
కటాఫ్ స్థాయిని మించి ఏప్రిల్ ద్రవ్యోల్బణం నమోదైతే మళ్లీ ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచుతుందని బ్యాంక్ వర్గాలు బుధవారం తెలిపాయి. మార్చి ద్రవ్యోల్బణం 6.95 శాతానికి పెరగడం వల్లే గతవారం ఆర్బీఐ ద్రవ్య పరపతి కమిటీ అత్యవసర సమీక్ష నిర్వహించి 40 బేసిక్ పాయింట్లు పెంచడంతో రెపోరేటు 4.40 శాతానికి పెరిగింది.
ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్బణం కూడా 7.79 శాతానికి పెరిగింది. 2014 తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. ఇది ఆర్బీఐ కటాఫ్ స్థాయికంటే ఎక్కువ. ఈ నేపథ్యంలో వచ్చేనెల జరిగే ద్వైమాస సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.