Electric Demand | భారతీయులు తమ ఇండ్లలో ఎయిర్ కండీషనర్ల కోసం వాడే విద్యుత్ వినియోగం 2050 నాటికి తొమ్మిది రెట్లు పెరుగుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) పేర్కొంది. ఇది ప్రస్తుతం ఆఫ్రికా ఖండ దేశాలు వాడుతున్న విద్యుత్ మొత్తానికి సమానం అని తెలిపింది. వచ్చే 30 ఏండ్లలో అన్ని దేశాల కంటే ఎక్కువగా భారత్ లోనే విద్యుత్ కోసం డిమాండ్ పెరుగుతుందని వెల్లడించింది.
గతేడాదితో పోలిస్తే వచ్చే ఏడేండ్లలో విద్యుత్ వినియోగం 60 శాతం పెరుగుతుందని, దీనికి ఏసీలు, ఇతర కూలింగ్ పరికరాలు వాడటమే కారణం అని ఐఈఏ వెల్లడించింది. పగలు కూలింగ్ అవసరాలకు సౌరశక్తి వినియోగించుకునే అవకాశం ఉంది. కానీ భూతాపం ప్రభావంతో రాత్రి వేళల్లో కూడా బాగానే విద్యుత్ వాడకం ఉంటుంది. కానీ, విద్యుత్ వాడకం సమర్థవంతంగా తగ్గించే పద్దతులు అమలు చేయాలని ఐఈఏ సూచించింది. దీంతో అధిక విద్యుత్ ప్రొడక్షన్, బ్యాటరీల తయారీపై చేసే ఖర్చు.. సంప్రదాయేతర ఇంధన వనరుల్లోకి మళ్లించవచ్చునని వివరించింది.
కర్బన ఉద్గారాల నియంత్రణ లక్ష్యం, క్లీన్ ఎనర్జీ వనరులపై ఫోకస్ ద్వారా కొత్త ఫ్యుయల్ యుగంలోకి భారత్ వెళ్లనున్నదని ఐఈఏ గుర్తు చేసింది. 2070 నాటికి దేశంలో పూర్తిగా కర్బన ఉద్గారాలను నియంత్రించాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ఈ క్రమంలో క్లీన్ ఎనర్జీ ఉత్పత్తితోపాటు సరఫరా పెంచడానికి పలు విధానాలు రూపొందించింది.