న్యూఢిల్లీ, మే 3: దేశీయ ఎగుమతులు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. గత నెలలో ఏకంగా 38.19 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఒక నెలలో ఇంతటి స్థాయిలో ఎగుమతులు జరగడం ఇదే తొలిసారి. పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్, కెమికల్స్ ఉత్పత్తులు ఆశాజనక పనితీరు కనబర్చడంతో అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన ఎగుమతులతో పోలిస్తే 24.22 శాతం అధికం.
ఇదే నెలలో 58.26 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకున్నది. దీంతో వాణిజ్యలోటు 20 బిలియన్ డాలర్లుగా ఉన్నది. గత నెలలో చమురు దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 81.21 శాతం పెరిగి 19.5 బిలియన్ డాలర్లకు చేరుకోగా, బొగ్గు, కోక్ దిగుమతులు కూడా 2 బిలియన్ డాలర్ల నుంచి 4.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కానీ, పసిడి దిగుమతులు మాత్రం 6.23 బిలియన్ డాలర్ల నుంచి 1.68 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.