ముంబై, మార్చి 18 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నప్పటికీ మదుపరులు మాత్రం కొనుగోలుకు మొగ్గుచూపారు. ఫలితంగా వరుసగా మూడోరోజూ బుధవారం కూడా సూచీలు ఒక్క శాతం వరకు బలపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడం, గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు ర్యాలీకి తోడయ్యాయి. ఒక దశలో వెయ్యి పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 633.29 పాయింట్లు అందుకొని 76,704.13 వద్ద స్థిరపడింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 196.65 పాయింట్లు ఎగబాకి 23,777.80 పాయింట్లకు చేరుకున్నది.
స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో మదుపరులు సంపద అమాంతం పెరిగింది. వరుసగా మూడు రోజుల్లో వీరి సంపద రూ.9 లక్షల కోట్లకు పైగా ఎగబాకింది. గత మూడు సెషన్లలో బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 2,140.21 పాయింట్లు లేదా 2.87 శాతం బలపడింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల విలువ రూ.9,18,579.57 కోట్లు బలపడి రూ.4,39,00,831 కోట్లు(4.75 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకున్నది.