ముంబై, జూలై 6: స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఆర్థిక, వాహన రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో దేశీయ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. క్రూడాయిల్ ధరలు 100 డాలర్ల దిగువకు పడిపోవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను కుమ్మరించడంతో ప్రారంభం నుంచి లాభాల బాటపట్టాయి. ఇదే ట్రెండ్ను చివరి వరకు కనపర్చాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చాలా రోజుల తర్వాత 616.62 పాయింట్లు లేదా 1.16 శాతం లాభపడి 53,750.97 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 684 పాయింట్లు లాభపడిన సూచీ చివర్లో ఇంతటి లాభాలను నిలుపుకోలేకపోయింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ 178.95 పాయింట్లు(1.13 శాతం) అందుకొని 15,989.80 పాయింట్ల వద్ద ముగిసింది.