న్యూఢిల్లీ : ఆర్ధిక మందగమనంతో పాటు స్ధూల ఆర్దిక వాతావరణం ప్రతికూలంగా మారుతుండటంతో టెక్ కంపెనీలు, స్టార్టప్లు (Indian startup) ఎడాపెడా లేఆఫ్స్కు తెగబడుతున్నాయి. సంక్లిష్ట పరిస్ధితుల్లో కంపెనీల నిర్వహణకు ఖర్చులకు కళ్లెం పేరుతో కొలువుల కోతకు దిగుతున్నారు. లేటెస్ట్ లేఆఫ్స్లో భాగంగా ఇండియన్ స్టార్టప్ చింగారి 20 శాతం సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది.
కంపెనీ పునర్వ్యవస్ధీకరణలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను 20 శాతం తగ్గించనున్నట్టు వెల్లడించింది. ఈ నిర్ణయం ఎంతో బాధతో కూడుకున్నదని, ఇది ఉద్యోగులపై చూపే ప్రభావాన్ని తాము అర్ధం చేసుకోగలమని కంపెనీ ప్రతినిధి లేఆఫ్స్ను నిర్ధారిస్తూ వ్యాఖ్యానించారు. బాధిత ఉద్యోగులకు కంపెనీ పరిహార ప్యాకేజ్ను వర్తింపచేస్తుందని పేర్కొన్నారు. రెండు నెలల వేతనంతో కూడిన పరిహార ప్యాకేజ్ను కొలువులు కోల్పోయిన ఉద్యోగులకు అందచేస్తామని చెప్పారు. ఈ సంక్లిష్ట సమయంలో వారి ఆరోగ్య బీమా కవరేజ్ను మరో మూడు నెలల పాటు కొనసాగేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
పరిహార ప్యాకేజ్తో పాటు బాధిత ఉద్యోగులకు కెరీర్ కౌన్సెలింగ్, జాబ్ ప్లేస్మెంట్ను ఆఫర్ చేస్తామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. చింగారి యాప్ 2018 నవంబర్లో గూగుల్ ప్లేస్టోర్లో లాంఛ్ కాగా, ఈ సోషల్ ఎంటర్టైన్మెంట్ యాప్ను సుమీత్ ఘోష్, బిశ్వాత్మ నాయక్, దీపక్ సాల్వి, ఆదిత్య కొఠారి ప్రారంభించారు. 2022 నాటికి ఈ యాప్ యూజర్ల సంఖ్య 15 భాషల్లో ఏకంగా 16 కోట్లకు పైగా పెరిగింది. ఆపై యాప్నకు రోజూ 50 లక్షల డైలీ యాక్టివ్ యూజర్లు, నెలకు 4 కోట్ల మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు.
Read More :
Nandan Nilekani: ఐఐటీ బాంబేకి 315 కోట్లు విరాళం ఇచ్చిన నందన్ నిలేకని